161 మంది భారతీయుల్ని తిరిగి పంపుతున్న అమెరికా

మనోళ్లలో పలువురిని అగ్రరాజ్యం అమెరికా తిప్పి పంపేలా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుల్ని అక్కడి అధికారులు గుర్తించారు. అమెరికాలోని మెక్సికన్ సరిహద్దు ద్వారా దేశంలోకి అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయుల్ని గుర్తించారు. అలాంటి వారిని అమెరికాలో ఉంచేందుకు వీలున్న న్యాయపరమైన అవకాశాలు తాజాగా ముగిశాయి.

దీంతో.. వారిని భారత్ కు తిప్పి పంపనున్నారు. ప్రత్యేక విమానంలో ఈ 161 మందిని భారత్ కు పంపనున్నారు. వీరిలో హర్యానాకు చెందిన 76 మంది.. పంజాబ్ కు చెందిన వారు 56.. గుజరాత్ కు చెందిన వారు పన్నెండు మంది ఉన్నారు. వీరితో పాటు.. యూపీ (5).. మహారాష్ట్ర (4).. కేరళ.. తెలంగాణ.. తమిళనాడులకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున ఉన్నారు. ఇక.. ఏపీ.. గోవాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

ఎలాంటి న్యాయపరమైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వారిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇలా అమెరికాలోకి ప్రవేశించిన వారంతా బ్రోకర్ల మాటలు నమ్మి రూ.35 నుంచి రూ.50 లక్షల మొత్తాన్ని చెల్లించి మరీ అమెరికాకు వెచ్చారు.

ఇప్పుడు భారీ మొత్తం పోవటమే కాదు.. కేసుల్లో చిక్కుకొని.. జైల్లో ఉంటూ.. చివరకు దేశానికి తిరిగి వచ్చేస్తున్న దుస్థితి. సో.. మాయమాటల్ని నమ్మి మోసం పోవటం.. అడ్డంగా బుక్ కావటం లాంటివి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.