అంబానీ ఇంటికి కడియం చెట్లు..

ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ఒకరైన వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో ఆయన నివసించే ఇల్లు ఎంతలాఉంటుందో తెలిసిందే. అత్యంత విలాసవంతమైన ఆ ఇంటి గురించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు వచ్చాయి. తాజాగా గుజరాత్ లోని జాంనగర్ లో మరో ఇంటిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సువిశాలంగా ఉండనున్న ఈ ఇంటికి ఆకర్షనీయంగా ఉండేందుకు రెండు చెట్లను తాజాగా కొనుగోలు చేశారు. ఈ అలీవ్ చెట్ల అందమే వేరు. వీటిని స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా కడియంకు తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కడియం – వీరవరం రోడ్డులోని గౌతమీ నర్సరీ ప్రత్యేకత తెలిసిందే. దీని యజమాని మార్గాని వీరబాబు.. తన అభిరుచికి తగ్గట్లుగా పెద్ద ఎత్తున మొక్కలు.. చెట్లు.. వివిధ జాతుల్ని సేకరిస్తుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా.. దేశంలోనే అత్యంత అరుదైన మొక్కల్ని పెంచి అమ్ముతుంటారు.

ముకేశ్ అంబానీ లాంటి వ్యాపారవేత్త ఇంటికి అవసరమైన చెట్ల కోసం దేశ వ్యాప్తంగా గాలించి.. కడియం నుంచి రెండు ఆలీవ్ చెట్లనుఎంపిక చేశారు. ఇందుకోసం అంబానీకి చెందిన రిలయన్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా వచ్చి వీటిని ఎంపిక చేశారు. చూసినంతనే ఆకర్షణీయంగా ఉండటమతో పాటు.. సువిశాలమైన ఇంటి ప్రాంగణలోని వీటిని ఉంచాలే కానీ.. ఇంటికి కొత్త అందాన్ని తీసుకురావటం ఖాయం. ఇంతకీ.. ఈ రెండు చెట్ల ధర తెలిస్తే గుండె వేగంగాకొట్టుకోవటం ఖాయం.

ఈ అరుదైన చెట్టు ఒక్కొక్కటి రూ.25లక్షలుగా చెబుతున్నారు. అంటే.. రెండు చెట్లకు రూ.50 లక్షలు ఖర్చు చేశారన్న మాట. అంతేకాదు.. ఈ చెట్లను కడియం నుంచి గుజరాత్ కు తరలించేందుకు వీలుగా ప్రత్యేక ట్రాలీని ఏర్పాటు చేశారు. ఇందుకయ్యే రవాణా ఛార్జీనే రూ.3.5లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. కొంత కాలం క్రితం స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా ఈ చెట్లను తీసుకొచ్చారు.

ఇందుకోసం ఓడలో ప్రత్యేక కంటైనర్ లో తీసుకొచ్చి.. గోదావరి మట్టి.. నీళ్లతో ప్రత్యేక విధానాల్ని అనుసరించి దీన్ని పెంచారు. ఎంతోకాలంగా పెంచిన చెట్లు తమను వదిలివెళ్లిపోతున్న వేళ.. కడియం నర్సరీలో పని చేసే కార్మికులు ఫోటోలు దిగారు. స్పెయిన్ నుంచి ఈ చెట్లను తీసుకురావటానికి చాలానే ఖర్చు అయినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అంబానీ లాంటి కుబేరులు ఉండే ఇంటికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చి చెట్లకు రూ.55 లక్షల ఖర్చు పెద్దదేం కాదనే చెప్పాలి.