సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్సింగ్.. రైల్వే ట్రాక్ మీద తండ్రి డెడ్ బాడీ

షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ప్రముఖ ప్లేబాక్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద రీతిలో మరణించారు. హైదరాబాద్ నివాసి అయిన ఆయన.. వారం నుంచి కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన డెడ్ బాడీ బెంగళూరు రైల్వే ట్రాక్ మీద పోలీసులు గురించారు. ఏకే రావు కుటుంబ సభ్యుల ఫోన్లు పని చేయటం లేదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వారి ఫ్యామిలీ మెంబర్లు వారం రోజులుగా కనిపించటం లేదు.

నిజానికి వారం నుంచి సింగర్ హరిణి కుటుంబం మొత్తం మిస్ అయినప్పటికీ ఆ సమాచారం బయటకు రాలేదు.కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన సందర్భంలోనే.. ఆయన డెడ్ బాడీ అక్కడెక్కడో బెంగళూరులో కనిపించటం.. అది కూడా రైల్వే ట్రాక్ మీద అనుమానాస్పద రీతిలో ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు కనిపించకుండా పోయిన ఏకే రావు కుటుంబం బెంగళూరు వెళ్లారా? లేదంటే.. ఎవరైనా అక్కడకు తీసుకెళ్లారా? అన్నది మిస్టరీగా మారింది.

షాకింగ్ అంశం ఏమంటే.. అనుమానాస్పద రీతిలో మరణించిన ఏకే రావు.. ప్రముఖ రాజకీయ నాయకుడు.. రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్ కు సీఈవోగా పని చేస్తుంటారు. తెలుగు.. తమిళ.. కన్నడ.. మలయాళం.. హిందీ సినిమాలకు సంబంధించి ఎన్నో పాటలు పాడిన సింగర్ హరిణి మంచి గుర్తింపు పొందారు. దాదాపు 3500కు పైగా పాటలుపాడారు.

మురారి.. గుండుబా శంకర్.. నేను మీకు తెలుసా.. ఘర్షణ.. సైనికుడు.. 100% లవ్.. లెజెండ్.. స్పైడర్.. నిశ్శబద్దం లాంటి పలు సినిమాలకు ఆమె పాటలు పాడారు. 42 ఏళ్ల హరిణికి పెళ్లై.. భర్త ఉన్నారు. సింగర్ గా మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆమె సుపరిచితురాలు. క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇదిలా ఉంటే.. ఏకే రావు మరణాన్ని అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కనిపించకుండా పోయిన ఏకే రావు కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఏకే రావు.. సుజనా ఫౌండేషన్ సీఈవోగా మాత్రమే కాదు.. సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్ గా కూడా పని చేస్తున్నారు. ఇప్పుడీ ఉదంతం షాకింగ్ గా మారింది.