ఆ నలుగురు వైసీపీ నేతలకు అదనపు భద్రత

కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. అంబటి రాంబాబు.. ఈ మధ్య వార్తల్లో నిలిచిన వైకాపా నేతలు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న ఎపిసోడ్లో వీళ్లది కీలక పాత్ర. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా దారుణ వ్యాఖ్యలు చేసింది ఈ నలుగురే అన్నది ఆరోపణ.

ఈ ఎపిసోడ్లో ముందుగా అంబటి రాంబాబు మాట్లాడబోతుంటే.. అరగంట చాలా అంటూ తెలుగు దేశం వర్గం నుంచి ఎవరో కామెంట్ చేస్తే దానికి బదులుగా రాంబాబేమో ఎలిమినేటి మాధవరెడ్డి గురించి మాట్లాడదామా అని వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం ఏంటని తెలుగుదేశం వాళ్లకు అర్థమవ్వగానే మాట మార్చి మాధవరెడ్డి హత్య గురించి చర్చిద్దామా అంటూ మాట మార్చారు రాంబాబు.

ఇంతలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు.. లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా అంటూ దారుణమైన వ్యాఖ్య చేశారన్నది మీడియాలో వినిపిస్తున్న మాట. వల్లభనేని వంశీ ఇంతకుముందే ఈ విషయంలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని సైతం ఇదే రకంగా మాట్లాడారు.

ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వైపు నుంచి ఈ నలుగురి మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ.. ఈ నలుగురి పేర్లు ప్రస్తావిస్తూ ‘ఒరేయ్’ అని సంబోధిస్తూ హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. సోషల్ మీడియాలో, బయట కూడా తెలుగుదేశం మద్దతుదారుల నుంచి వీరికి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నలుగురికీ జగన్ సర్కారు భద్రతను పెంచడం గమనార్హం. ఇలాంటి విషయాల్లో వైకాపా నేతలు కానీ, ప్రభుత్వం కానీ భయపడ్డట్లు కనిపించదు. ప్రతిపక్షం నుంచి హెచ్చరికలు వస్తే.. ఇంకా ఎదురు దాడి చేసి వాళ్ల నోళ్లు మూయించడానికే చూస్తారు. తాము భయపడ్డ సంకేతాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు ఇలా వారికి సెక్యూరిటీ పెంచడం చర్చనీయాంశం అవుతోంది.

నిజంగా ఈ నలుగురు నేతలు తమకేమైనా అవుతుందని భయపడ్డారా.. లేక ఈ వ్యవహారంలో చంద్రబాబుకు సింపతీ పెరుగుతోందన్న విషయం గుర్తించి తామే బాధితులమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా.. లేక దీని వెనుక వేరే ప్రణాళిక ఏమైనా ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.