ఉదయ్ కిరణ్ లాస్ట్ లెటర్.. నిజమేనా?

ఉదయ్ కిరణ్ పేరెత్తితే చాలు.. జనాల నోట్లో అయ్యో పాపం అన్న మాటొస్తుంది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి వరుస విజయాలతో చూస్తుండగానే స్టార్ అయిపోయాడతను. మనలో ఒకడిలా అనిపించే కుర్రాడు అలా హీరోగా ఎదుగుతుంటే అందరికీ చాలా ఆనందమేసింది. హీరోగా ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడనుకుంటే.. అనూహ్యంగా వరుస పరాజాలు చుట్టుముట్టి వెనుకబడిపోయాడు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డట్లే కనిపించాడు కానీ.. ఏం జరిగిందో ఏమో.. ఆత్మహత్య చేసుకుని అర్ధంతరంగా తనువు చాలించేశాడు.

ఉదయ్ చనిపోయి ఏడేళ్లు దాటినా ఇంకా తన మరణం అభిమానులను బాధ పెడుతూనే ఉంది. ఉదయ్ ఇలా చేసి ఉండాల్సింది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో అతడికి అంత కష్టం ఏమొచ్చిందో అన్న ఆలోచనా అభిమానుల్లో కలుగుతోంది. ఉదయ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో అందుకు కారణాలేంటో లేఖలాంటిదేమీ రాసినట్లు వార్తలేమీ రాలేదు.

కానీ ఉదయ్ చనిపోయి ఏడేళ్ల తర్వాత అతడి సుసైడ్ నోట్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. తన భార్యనుద్దేశించి ఉదయ్ రాసిన లేఖగా దీన్ని భావిస్తున్నారు. ఇది నిజంగా ఉదయ్ రాసిందా.. ఎవరైనా క్రియేట్ చేశారా అన్నది తెలియదు కానీ.. ఈ లేఖ సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం పదండి.

‘‘విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో.. ఆ తర్వాత అంతగా నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచివాడు అని అనుకుంటున్నావు.. కానీ అతను అస్సలు మంచివాడు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు వస్తుంది. కానీ అప్పుడు ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికా వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినీ ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్‏గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’’.. ఇదీ ఉదయ్ రాసిన లేఖలో ఉన్నట్లుగా చెబుతున్న సారాంశం. ఇదే నిజమైతే చనిపోవడానికి ముందు భార్యతో ఉదయ్‌కి గొడవలున్నాయని స్పష్టమవుతోంది.