ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అంతా బాగుంది కానీ

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు రాజకీయం బాగానే వంట పడుతోందని ఈ మధ్య ఆయన తీరు చూస్తుంటే అర్థమవుతోంది. ఒకప్పుడు ఆవేశం తప్ప ఆలోచన లేదని పవన్‌ను వియర్శించేవారు. ఆ తర్వాతేమో మరీ దూకుడు తగ్గించేసి మర్యాదరామన్న తరహాలోకి మారిపోవడం అభిమానులకు అసలే నచ్చలేదు. ఐతే ఇటీవల పవన్ తీరు మార్చారు. ఆవేశానికి ఆలోచన జోడించి సూటిగా, సుత్తి లేకుండా తానేం చెప్పాలనుకున్నది చెబుతున్నాడు జనసేనాని.

తరచుగా పార్టీలో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నిర్మాణం మీద పవన్ బాగానే దృష్టిపెట్టినట్లే కనిపిస్తోంది. ఇక పవన్ చేయాల్సిందల్లా జనాల్లో బాగా తిరగడం, ప్రజా సమస్యల మీద పోరాడటమే. ఐతే ఇక్కడే పవన్ కొంచెం వెనుకబడుతున్నట్లు కనిపిస్తోంది.

మూడు రాజధానుల బిల్లులపై ప్రభుత్వం మడమ తిప్పడం, అలాగే వరదలతో అల్లాడుతున్న జనాలను ఆదుకునే విషయంలో జగన్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై పవన్ ట్విట్టర్ ద్వారా ఎంతో సూటిగా ప్రశ్నించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మామూలుగా పవన్‌ను వ్యతిరేకించే వాళ్లు సైతం ఈ రెండు అంశాల్లో పవన్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లపై ప్రశంసలు కురిపించారు. జగన్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్కలను సంధించాడు పవన్ ఆ ప్రెస్ నోట్లలో.

ఐతే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. వరదల సమయంలో అల్లాడుతున్న ప్రజల దగ్గరికి వెళ్లే నాయకుడికి వచ్చే మైలేజే వేరుగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేవలం గాల్లో తూతూమంత్రంగా తిరిగి వెళ్లిపోతున్నాడని.. క్షేత్ర స్థాయిలో తమకు సరైన సాయం అందట్లేదని.. తమను ముందుగా హెచ్చరించడంలో కానీ, ఆ తర్వాత సమస్య నుంచి బయటపడేసే విషయంలో కానీ.. యంత్రాంగా పూర్తిగా విఫలమైందనే అభిప్రాయంతో జనాలున్నారు.

ఇలాంటి టైంలో ప్రతిపక్ష పార్టీల నేతలు వస్తే వారికి తమ గోడు చెప్పుకుంటున్నారు. వాళ్లు చిన్న సాయం అందించినా, తమ తరఫున పోరాడినా దేవుళ్లలా చూస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సత్వరం స్పందించి కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో చంద్రబాబుకు దక్కిన ఆదరణ అపూర్వం. అది చూసే ఆయన ధైర్యంగా వరదల్లో చనిపోయిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే వరదల్లో అల్లాడుతున్న వారికి రూ.5 వేల చొప్పున సాయమూ ప్రకటించారు.

పవన్ వచ్చి ఇలా సాయం ప్రకటించకపోయినా పర్వాలేదు కానీ.. ఇలాంటి టైంలో జనాల్లో తిరిగితే జనాలకు గురి ఏర్పడుతుంది. కష్టాల్లో ఉన్నపుడు ఇచ్చే ఓదార్పు ఎంతో విలువైంది. కాబట్టి ఆలస్యమైనా సరే.. సినిమా కమిట్మెంట్లేవైనా ఉన్నా సరే.. వాటిని కొన్ని రోజులు పక్కన పెట్టి పవన్ కార్యక్షేత్రంలోకి దిగాల్సిన అవసరముంది.