కేటీఆర్ బృందం 4 గంటలు వెయిటింగ్ లో పీయూష్?

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ అన్న మాట తరచూ చెబుతుంటారు. అదే మాటను గొప్పగా చెబుతారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. గులాబీ నేతలు సైతం ఇదే విషయాన్ని మా గొప్పగా చెబుతారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ అన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు ఎవరైనా.

ఒకవిధంగా చెప్పాలంటే.. సీఎం హాజరు కావాల్సిన చాలా కార్యక్రమాలకు ఆయన హాజరు కాకున్నా.. కేటీఆర్ హాజరై ఆ లోటును తీరుస్తారు. కేటీఆర్ వస్తే.. కేసీఆర్ వచ్చినట్లుగా ఫీలయ్యే వారు లేకపోలేదు.

అంటే.. కేటీఆర్ వచ్చారంటే.. కేసీఆర్ వచ్చినట్లే. అలాంటప్పుడు కేంద్రమంత్రిని కలవటానికి తన టీంతో మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వద్దకు వెళ్లినప్పుడు.. ఆయనతో భేటీ కోసం మంత్రిగారి ఆఫీసులో నాలుగు గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందా? అంటే అవునని చెబుతున్నారు. ఇంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుందని గులాబీ బ్యాచ్ లోని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన కీలకమైన నేత..తన టీంతో వస్తే వ్యవసాయ మంత్రి ఇంత సేపు వెయిట్ చేయించారా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర సమాధానం లభిస్తోంది.

కేంద్రమంత్రి వద్దకు వెళ్లే సమయంలో ఆయన అపాయింట్ మెంట్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ.. కేటీఆర్ టీం అలాంటి పని చేయలేదు. మాట వరసకు అడగటం.. ఆ విషయం గురించి తెలిసినంతనే ఆయన.. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత రావాలని.. అది కూడా ముందుగా టైం చెప్పాలని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన కార్యాలయ సిబ్బంది మంత్రి కేటీఆర్ అండ్ కోకు సమాచారం ఇచ్చే సమయానికి వారు పీయూష్ ఆఫీసుకు చేరుకున్నారు. అంటే.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత టైం తీసుకొని రావాలంటే.. మూడు గంటలకే మంత్రి పేషీకి వచ్చి కూర్చున్నారు.

మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి.. గంగుల కమలాకర్.. ఎంపీలు కేకే.. నామా నాగేశ్వరరావు రాష్ట్ర సీఎస్ తో పాటు పలువురు కలిసి టీంగా వెళ్లారు. వారు వెళ్లే సమయానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వేరే కార్యక్రమంలో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన తన కార్యాలయానికి రావటానికి మూడున్నర గంటలకు పైనే పట్టింది. దీంతో.. మొత్తంగా కేటీఆర్ బృందం దాదాపు నాలుగు గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవపరం ఏర్పడింది. ఉప్పుడు బియ్యం ఎంత కొంటారు? బియ్యం సేకరణ పై కేంద్రం నుంచి మరింత స్పష్టత కోసం.. వారిపై ఒత్తిడి తీసుకురావటం కోసం కేటీఆర్ టీం కేంద్రమంత్రిని కలవటానికి వెళ్లటం తెలిసిందే.

తాము కేంద్రమంత్రి పేషీకి చేరుకున్న తర్వాత.. ఆయన్ను కలవటానికి మంత్రి కేటీఆర్ పదే పదే పీయూష్ కు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు కేంద్రమంత్రి పీయూష్ స్పందిస్తూ.. అపాయింట్ మెంట్ కన్ఫర్మ్ కాకుండా ఎందుకు వచ్చారు? నేను ఆఫీసుకు వచ్చిన తర్వాత నేనే మీకు సమాచారం ఇస్తానని చెప్పాను కదా? అని వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. అయితే.. కేటీఆర్ మాత్రం పదే పదే కేంద్రమంత్రికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ అంశం రాజకీయ పరిణామంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.