అలా అన్న రాజ‌మౌళి.. ఇలా చేస్తున్నాడేంటి?

కొన్ని రోజుల కింద‌టే ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి ఒక ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో పాల్గొన్నాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆ సంద‌ర్భంగా 2022 జ‌న‌వ‌రి 7న‌ ఆర్ఆర్ఆర్‌, 6న గంగూబాయి క‌తియావాడీ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌టం గురించి ఓ విలేక‌రి ప్ర‌శ్నిస్తే.. కొవిడ్ అనంత‌ర ప‌రిస్థితుల్లో ఇలాంటి పోటీ అనివార్య‌మ‌ని, త‌న దృష్టిలో పోటీ వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య లేద‌ని.. విష‌యం ఉంటే రెండు కాదు, ఎన్ని సినిమాలైనా కూడా ఒకేసారి రిలీజై బాగా ఆడ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

దీన్ని బ‌ట్టి త‌న సినిమా వ‌ల్లో మ‌రో చిత్రానికి.. ఇంకో సినిమా వ‌ల్ల త‌న చిత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న‌ది రాజ‌మౌళి అభిప్రాయం అన్న‌ది స్పష్టం. ఐతే మీడియా ముందు అలా చెప్పిన జ‌క్క‌న్న‌.. ఆర్ఆర్ఆర్‌కు పోటీ లేకుండా చూడ‌టానికి తెర వెనుక గట్టి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా ఈ మ‌ధ్య జోరుగా వార్త‌లొస్తున్నాయి.

గంగూబాయి క‌తియావాడీ సినిమాను ఆర్ఆర్ఆర్‌కు భ‌య‌ప‌డి వాయిదా వేయ‌లేద‌ని.. రాజ‌మౌళి విన్న‌పం మేర‌కే ఈ సినిమాకు డేట్ మార్చార‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొచ్చాయి. ఇప్పుడేమో భీమ్లా నాయ‌క్ మూవీని జ‌న‌వ‌రి 12 నుంచి త‌ర‌లించేందుకు రాజ‌మౌళి గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ చేసిన ప్ర‌య‌త్నం కూడా విఫ‌ల‌మ‌వ‌డంతో ఇప్పుడు రాజ‌మౌళి నేరుగా రంగంలోకి దిగుతున్నాడ‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసి డేట్ మార్చుకునే విష‌య‌మై రిక్వెస్ట్ చేయ‌బోతున్నాడ‌ని అంటున్నారు. ఇదే నిజ‌మైతే జ‌క్క‌న్న పైకి చెప్పిన మాట‌ల‌కు, లోలోన చేస్తున్న ప‌నికి పొంత‌న లేదు అనుకోవాలి. అంటే వేరే సినిమాల‌కు జ‌క్క‌న్న భ‌య‌ప‌డుతున్నాడ‌ని కాదు కానీ.. పోటీ వ‌ల్ల థియేట‌ర్లు త‌గ్గి త‌మ చిత్రానికి రెవెన్యూ త‌గ్గుతుంద‌న్న‌ది ఆయ‌న ఆందోళ‌న కావ‌చ్చు.