జ‌గ‌న్ చేసిన పెళ్లి.. వియ్యం అందుకున్న కొలుసు-బుర్రా

వైసీపీలో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు, ఎమ్మెల్యేలు కూడా అయిన‌.. కొలుసు పార్థసార‌థి, బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌లు వియ్యం అందుకున్నారు. అయితే.. స‌హ‌జంగానే.. ఇలాంటి జ‌రుగుతుంటాయి. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు, పి. నారాయ‌ణ కూడా వియ్యం అందుకున్నారు. కానీ, వారికి .. ఇప్పుడు.. వియ్యం అందుకున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య కొంత తేడా ఉంది. టీడీపీ మంత్రుల వియ్యానికి .. పార్టీ అధినేత , అప్ప‌టి సీఎం చంద్ర‌బాబుకు మ‌ధ్య సంబంధం లేదు. వారికివారే మాట్లాడు కున్నారు. వివాహానికి మాత్ర‌మే చంద్ర‌బాబు హాజ‌రై.. వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

కానీ.. వైసీపీ నేత‌లైన కొలుసు, బుర్రాల వియ్యం వెనుక‌.. ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుందని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన కొలుసు పార్థ‌సార‌థి.. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న బుర్రామ‌ధుసూద‌న్‌యాద‌వ్‌లు ఒకే సామాజిక వ‌ర్గం. ఈ క్ర‌మంలో.. కొలుసు కుమారుడు నితిన్ కృష్ణ‌కు బుర్రా కుమార్తె అమృత భార్గ‌విల‌కు విజ‌య‌వాడ‌లో అట్ట‌హాసంగా వివాహం జ‌రిపించారు. ఈవివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌హా కీల‌క స‌ల‌హాదారు హాజరయ్యారు.

అయితే.. కొలుసు-బుర్రా కుటుంబాలు వియ్యం అందుకోవ‌డం వెనుక జ‌గ‌న్ ఉన్నార‌ని.. టాక్ న‌డుస్తోంది. కొన్నాళ్ల కింద‌ట‌ కొలుసు పార్థ‌సార‌థి త‌న కుమారుడిని తాడేప‌ల్లికి తీసుకువ‌చ్చి.. జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి రెడీగా ఉన్నార‌ని చెప్పార‌ట‌. అయితే.. మాట‌ల మ‌ధ్య‌లో వివాహం అయిందా..పిల్ల‌లు ఎంత‌మంది ఉన్నారు.. అనే చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు.. ఇంకా పెళ్లికాలేద‌ని.. కొలుసు జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఇది అక్క‌డితో అయిపోయింది.

ఆ త‌ర్వాత‌.. బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌.. గురించి ఆరా తీసిన‌ప్పుడు.. త‌న కుమార్తెకు వివాహ సంబంధాలు చూడ‌డంలో ఆయ‌న బిజీగా ఉన్నార‌ని..అందుకే.. ఆయ‌న ఒకింత పార్టీ కార్య‌క్రమాల‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని.. జ‌గ‌న్‌కు తెలిసింది. దీంతో ఆయ‌న కొలుసు కుమారుడి విష‌యాన్ని స్వ‌యంగా చెప్పార‌ని.. దీంతో ఈ రెండు కుటుంబాలు మాట్లాడుకుని వియ్యం అందుకున్నాయ‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో ఒక ఆస‌క్తికర టాక్ న‌డుస్తోంది.