తప్పు దిద్దుకున్న కాంగ్రెస్

ఇంతకాలానికి కాంగ్రెస్ అధిష్టానంలో మార్పు వచ్చినట్లే ఉంది. మధ్యప్రదేశ్ లో జరిగిన తప్పు రాజస్థాన్ విషయంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గానికి మధ్య పరిస్థితులు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సమయంలో తన వర్గాన్ని తీసుకుని పైలెట్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అధిష్టానం అప్రమత్తమవటంతో సచిన్ తన ప్రయత్నాలను మానుకున్నారు కాబట్టే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ అవుతోంది.

నిజానికి రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవ్వడంలో సచిన్ కష్టమే ఎక్కువుంది. అయితే సీనియర్ అయిన గెహ్లాట్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అండ్ కో దగ్గర తనకున్న సన్నిహితాన్ని ఉపయోగించుకుని తానే సీఎం అయ్యారు. సీఎం అయిన దగ్గర నుండి సచిన్ వర్గాన్ని చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. దాంతో గెహ్లాట్-సచిన్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది వ్యవహారం. అందుకనే పార్టీ నుంచి సచిన తన వర్గంతో బయటకు వెళ్ళిపోవాలని అనుకున్నారట.

సరే అధిష్టానం జోక్యం చేసుకుని రెండు వర్గాల మధ్య సంధి చేసింది. ఇందులో భాగంగానే మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించింది. ఆదివారం సాయంత్రం ఏర్పడిన కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గానికి బాగానే ప్రాధాన్యత దక్కింది. కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గంలోని 5 మందికి చోటు దక్కింది. శాఖలు కూడా ప్రాధాన్యత ఉన్నవే దక్కాయి. దాంతో సచిన్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి పనిచేయని కారణంగానే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది.

సీఎం కమలనాథ్ కు జ్యోతిరాదిత్య సింధియాకు పడకపోయినా అధిష్టానం జోక్యం చేసుకోలేదు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సింథియానే. అయినా కమలనాథ్ సీఎం అయిపోయారు. దాంతో సమస్యలు మొదలయ్యాయి. ఇపుడు రాజస్థాన్ విషయంలో అధిష్టానం జోక్యం చేసుకున్నట్లే అప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా జోక్యం చేసుకునుంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండుండేది.

చేజేతులారా తమ ప్రభుత్వాన్ని తామే కూల్చుకున్న తర్వాత అధిష్టానానికి కనువిప్పు అయినట్లుంది. అందుకనే రాజస్ధాన్లో జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని కాపాడుకుంది. నిజానికి పార్టీలో వృద్ధ తరాన్ని పక్కన పెట్టేసి యువతకు పెద్ద పీట వేయాలనే నినాదం పార్టీలో ఎప్పటి నుండో వినిపిస్తోంది. సభలు, సమావేశాల్లో అందరు దీనికి మద్దతుగా మాట్లాడుతారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వృద్ధతరానిదే ఆధిపత్యమవుతోంది. దీంతో యువనేతలు చాలామంది పార్టీని వదిలేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరుస్తుందా ?