స‌ల‌హాదారుల‌ను సాగ‌నంపుతారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని సీఎం జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా? లెక్క‌కు మిక్కిలిగా ఉన్న స‌ల‌హాదార్ల సంఖ్య‌ను త‌గ్గించేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంలోని మంత్రుల సంఖ్య కంటే స‌ల‌హాదారులే ఎక్కువ‌. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేబినేట్ సంఖ్య 25 అయితే.. అంత‌కంటే ఎక్కువ‌గా 33 మంది స‌ల‌హాదారులతో భారీ స్థాయిలో అడ్వైజ‌రీ క‌మిటీ నియ‌మించుకున్నారు.

ఇంత‌మంది స‌ల‌హాదార్లు ఉన్నా వాళ్లంద‌రు ప్రభావ‌వంతంగా ప‌ని చేస్తున్నారా? అంటే.. కాద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీళ్ల‌లో ఒక్కొక్క‌రికి నెల‌కు రూ.3 ల‌క్ష‌ల జీతంతో పాటు ప్ర‌తి నెల రెండు ల‌క్ష‌ల అల‌వెన్సులు ఇవి కాకుండా ఆఫీస్‌, కారు లాంటి స‌దుపాయాలు క‌ల్పిస్తున్నారు. మ‌రోవైపు అందులో ఓ అయిదారుగురు స‌ల‌హాదారుల‌కు క్యాబినేట్ ర్యాంక్‌తో పాటు ప్రోటోకాల్ అద‌నం.

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌ల‌హాదారుల‌కు ఇంత మొత్తంలో జీతాలు, ఇన్ని వ‌స‌తులు అవ‌స‌ర‌మా? అని ప్ర‌భుత్వ తీరుపై ఏపీ హైకోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

దీంతో స‌ల‌హాదారుల‌పై జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించార‌ని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల రాజ‌కీయంగా అవ‌కాశం ద‌క్క‌నివారు, పార్టీకి సేవ చేసినా ప‌ద‌వులు రాని వాళ్లు, సీఎం జ‌గ‌న్‌కు స‌హ‌క‌రించిన వాళ్ల‌ను ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారులుగా నియ‌మించారు. అయితే ఇంత‌మంది స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకుని ప్ర‌భుత్వ ధ‌నాన్ని వృథా చేస్తున్నార‌ని వైసీపీపై ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇంత చేసినా స‌ల‌హాదారుల వ‌ల్ల ప్ర‌భుత్వానికి జ‌రిగే మేలు కంటే న‌ష్ట‌మే ఎక్కువ ఉంద‌నే అభిప్రాయాలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంత‌మంది స‌ల‌హాదారులు ఉన్న‌ప్ప‌టికీ ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా మ‌ళ్లీ ప్ర‌శాంత్ కిశోర్ టీమ్‌నే రంగంలోకి దించాల్సిన ప‌రిస్థితి. రాష్ట్ర మంత్రివ‌ర్గంలో మార్పులు, చేర్పులకు కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరుపై పీకే టీమ్ స‌ర్వే నిర్వ‌హించి నివేదిక అందిస్తోంది.

మ‌రోవైపు కొన్ని కీల‌క అంశాల్లో త‌మ‌ను సంప్ర‌దించ‌క‌పోవ‌డం, త‌మ‌కు తెలీకుండానే నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతో కొంద‌రు స‌ల‌హాదారులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ఉన్న వాళ్ల‌లో జుల్ఫీరావ్డీ, సాగి దుర్గాప్ర‌సాద్‌, జీవీడీ కృష్ణ‌మోహ‌న్‌, దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌, పీట‌ర్ హాస‌న్‌, త‌ల‌శిల ర‌ఘురాం, ఎం. శామ్యూల్ లాంటి వారి పాత్ర నామ‌మాత్రంగానే ఉంద‌ని జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర ఏర్పాట్లు ప‌ర్యవేక్షించిన త‌ల‌శిల ర‌ఘురాం ఇప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఇక స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ త‌ర్వాత అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ ఉంది. మంత్రుల‌పై ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌రిగే కేబినేట్ విస్త‌ర‌ణ త‌ర్వాత స‌ల‌హాదారుల్లో కొంత‌మందిని ఇంటికి సాగ‌నంపే అవ‌కాశం ఉంటుంద‌ని స‌మాచారం.