‘పుష్ప’లో సమంత పాట సెన్సేషనే

టాలీవుడ్లో ఐటెం సాంగ్‌లకు ఒక స్థాయి తీసుకొచ్చిన ఘనత సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ జోడీకే దక్కుతుంది. సుకుమార్ ఎలాంటి సినిమా తీసినా సరే.. అందులో ఒక ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్ మూవీలో సైతం ఐటెం సాంగ్ పెట్టాడంటే సుకుమార్‌కు ఆ తరహా పాటలపై ఉన్న మక్కువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అది ఆయనకో సెంటిమెంటు లాగా మారిపోయింది. సుకుమార్ కొత్త చిత్రం ‘పుష్ప’లో సైతం సుక్కు ఈ సెంటిమెంటును కొనసాగిస్తున్నాడు.

ఇప్పటికే ‘పుష్ప’ నుంచి నాలుగు పాటలు రిలీజ్ కాగా.. వేటికవే మంచి ఆదరణ తెచ్చుకున్నాయి. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆ పాటలు మోత మోగించేస్తున్నాయి. టీవీ షోల్లో ఎక్కువగా ఈ పాటలనే పెర్ఫామ్ చేస్తుండటం అవి ఏ స్థాయిలో ఆదరణ పొందాయో చెప్పడానికి రుజువు. సినిమాలో మొత్తం ఉన్నవి ఐదు పాటలు కాగా.. ఇక మిగిలింది ఐటెం సాంగే.

‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత మెరవబోతుండటం తెలిసిన విషయమే. ఈ నెల 26న రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ మొదలు కాబోతోంది. నాలుగు రోజుల పాటు దీన్ని షూట్ చేస్తారని సమాచారం. టాకీ పార్ట్‌తో పాటు మిగతా పాటల చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాడు సుక్కు. ఈ పాట అవ్వగానే గుమ్మడికాయ కొట్టేయబోతున్నాడు. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సుక్కు-దేవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఐటెం సాంగ్స్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ పాట ఉంటుందట.

వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన పాటల్లో మాదిరే ఇందులో ఒక కాన్సెప్ట్ ఉంటుందట. పాట మొత్తం ఐటెం గర్ల్ కొంటెగా ప్రశ్నలు సంధిస్తూ వెళ్లేలా ఈ పాటను రాశారట చంద్రబోస్. ఒక ప్రశ్న సంధించి.. ‘ఊ అంటావా.. ఊహూ అంటావా మావా’ అని అడుగుతూ సాగేలా పాట ఉంటుందట. మంచి హస్కీ వాయిస్ ఉన్న సింగర్ ఈ పాట పాడినట్లు సమాచారం. మధ్య వరకు ఒక మోస్తరుగా సాగి.. మంచి ఊపుతో పాట ముగుస్తుందని.. ఈ పాట కచ్చితంగా ఒక సెన్సేషన్ అవుతుందని అంటున్నాయి.