చంద్రబాబు అస్త్రాన్ని రెడీ చేసుకున్నారా ?

ఇపుడిదే ప్రశ్న తెలుగుదేశంపార్టీ, తెలుగుమీడియాతో పాటు మామూలు జనాల్లో కూడా విస్తృతంగా వినిపిస్తోంది. ఈ ప్రశ్న ఇపుడు ఎందుకు వినిపిస్తోంది ? ఎందుకంటే ఇదే ప్రశ్నను చంద్రబాబే వచ్చే ఎన్నికల్లో జనాలను అడగాలని అనుకున్నారు కాబట్టి. చంద్రబాబు మాటల్లోనే ‘మీకు నా అవసరం ఉందనుకుంటే నన్ను గెలిపించుకోండి..లేకపోతే మీ ఇష్టం’ అని జనాలను డైరెక్టుగా అడగబోతున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తాజా వ్యాఖ్యలు విన్న తర్వాత రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నికల నినాదం ఏమిటో అర్ధమైపోతోంది.

రెండు రోజుల క్రితం తన భార్యను అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అవమానించారని ఆరోపించిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో భోరున ఏడ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. తన భార్యతో పాటు కుటుంబసభ్యులను కించపరచటం ద్వారా అందరినీ రోడ్డున పడేశారంటు చంద్రబాబు బాధపడ్డారు. చంద్రబాబుకు మద్దతుగా ఇతర పార్టీల నేతలు, నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీయార్ కుటుంబసభ్యులందరు అసెంబ్లీలో ఘటనను తప్పు పడుతున్నారు.

మాధవరెడ్డి పేరును అంబటి ఎత్తగానే చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయి తన భార్యను కించపరుస్తారా అంటు రెచ్చిపోయారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే చంద్రబాబుకు వైసీపీలోనూ సైలెంట్ గా మద్దతుగా కొందరు నిలబడితే మరికొందరు బహిరంగంగా తప్పుపడుతున్నారు. ప్రజల్లో అయితే అసెంబ్లీ సంఘటన నేపథ్యంలో చంద్రబాబుపై సానుభూతి చూపుతున్నట్లే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో కనిపిస్తోంది.

ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనాలను డైరెక్టుగా ఒకమాట అడగబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తన అవసరం ఉందనుకుంటే మద్దుతివ్వాలని అడగబోతున్నారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే జనాలపైకి చంద్రబాబు సెంటిమెంటు అస్త్రాన్ని సంధించబోతున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోలేకపోతున్నారని మంత్రులంటున్నారు. అసెంబ్లీలో మెజారిటి ఉండటం, కౌన్సిల్లో కూడా తమకే ఫుల్లు మెజారిటి వచ్చిన సమయంలోనే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటంతో చంద్రబాబు మానసికంగా దెబ్బతిన్నారని మంత్రులంటున్నారు. అందుకనే ఏమో సెంటిమెంటు అస్త్రాన్ని రెడీ చేసుకున్నారు.

ఈ వయసులో పనికిమాలిన వారితో అందరితో మాటలు పడటం అవసరమా? ఎన్నికల్లో గెలిస్తే ఏపీలో అభివృద్ధి చేసి చరిత్రలో నిలచిపోదాం అని, లేదంటే ప్రశాంతంగా రిటైరవుదాం… అభివృద్ధిపై ఫోకస్ పెట్టే తనను వచ్చే ఎన్నికల్లో కూడా జనమే అవసరం లేదనుకుంటే మనకెందుకు తాపత్రయం ప్రశాంతంగా రిటైరవుదాం… వారు కోరుకుంటే చరిత్రలో నిలిచిపోయేలా ఏపీని మారుస్తాను అని సీనియర్ నేతలతో ఆంతరంగికంగా చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.