రిటైర్మెంట్‌పై ధోని కొత్త మాట‌

మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి ఈ ఏడాది జులై 7న 40 ఏళ్లు నిండాయి. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యానికి అత‌ను 41వ ప‌డికి ద‌గ్గ‌ర‌గా ఉంటాడు. అత‌ను ఇంత‌కుముందులా బ్యాటింగ్‌లో జోరు చూపించ‌లేక‌పోతున్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల కింద‌టే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూరం కావ‌డం వ‌ల్ల మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో అత‌ను ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేసే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింద‌నే అనుకుంటున్నారంతా.


గ‌త ఏడాది ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం, ధోని ఆట‌గాడిగా, కెప్టెన్‌గా విఫ‌లం కావ‌డంతో ఈ ఏడాది ధోని క‌థ ముగిసిపోతుంద‌ని కొంద‌రు అంచ‌నా వేశారు. ఐతే ధోని కెప్టెన్‌గా త‌న స‌త్తా చూపిస్తూ మ‌రోసారి చెన్నైకి టైటిల్ అందించాడు. అందులోనూ ఐపీఎల్ స‌గం నుంచి యూఏఈలో జ‌ర‌గ‌డంతో చివ‌రి మ్యాచ్ అక్క‌డ ఆడి ముగించాల‌ని ధోని కోరుకుని ఉండ‌క‌పోవ‌చ్చు.

మ‌రి 2022దే ధోని చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ అవుతుందా.. చెన్నైలోనే అత‌ను రిటైర్ కాబోతున్నాడా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌య‌మై ధోని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ అయ్యాక భార‌త జ‌ట్టు మెంటార్‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం యూఏఈలోనే ఉన్న ధోని.. కొన్ని రోజుల కింద‌టే స్వ‌దేశానికి వ‌చ్చాడు. శ‌నివారం అత‌ను చెన్నై చేరుకుని ఐపీఎల్ టైటిల్ విజ‌యోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్నాడు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ధోని మాట్లాడుతూ.. తాను జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకుని చేయ‌లేద‌ని.. త‌న చివ‌రి టీ20ని చెన్నైలోనే ఆడాల‌నుకుంటున్నాన‌ని.. అది వ‌చ్చే ఏడాదా ఇంకో అయిదేళ్ల త‌ర్వాతా అన్న‌ది చెప్ప‌లేన‌ని వ్యాఖ్యానించాడు. మొత్తానికి ధోని చెన్నైలోనే క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటాడ‌ని స్ప‌ష్టం. ఇక ఈ కార్య‌క్ర‌మంలో స్టాలిన్ మాట్లాడుతూ.. తాను ఈ వేడుక‌కు ముఖ్య‌మంత్రిలా రాలేద‌ని.. ధోని ఫ్యాన్‌గా వ‌చ్చాన‌ని.. త‌న కుటుంబ స‌భ్యులు అంద‌రూ కూడా ధోని అభిమానులే అని.. మ‌హి ఇంకా చాలా ఏళ్ల పాటు చెన్నై జ‌ట్టును న‌డిపించాల‌ని కోర‌డం విశేషం.