బాబు క‌న్నీరు.. తెలంగాణ‌నూ క‌దిలించిందే!

ఔను.. ఇప్పుడు ఈమాటే వినిపిస్తోంది. టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌.. మాజీ సీఎం చంద్ర‌బాబు త‌న‌కు అసెంబ్లీలో ఘోర అవ‌మానం జ‌రిగిందంటూ.. క‌న్నీరు పెట్టుకున్నారు. మీడియా ముందు.. ఎంతో ధైర్యంతో మాట్లాడే చంద్ర‌బాబు.. ప్ర‌త్య‌ర్థుల‌పై నిప్పుల చెరిగే.. చంద్ర‌బాబు ఒక్క‌సారిగా భోరుమ‌న్నారు. దీంతో అంద‌రూ క‌దిలిపోయారు. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఏపీ స‌ర్కారుపై దుమ్మెత్తిపోశారు. అయితే.. ఈవిష‌యంలో ఏపీలోని రాజ‌కీయ ప‌క్షాల‌క‌న్నా..కూడా తెలంగాణ నుంచి మంచి స్పంద‌న రావ‌డం.. అసెంబ్లీ జ‌రిగిన ఘోరాన్ని తీవ్రంగా ఖండించ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి తెలంగాణ‌లో టీడీపీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేకుండా పోయింది.

అయితే.. అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌, అనంత‌రం చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకున్న తీరును నిశితంగా గ‌మ‌నించిన తెలంగాణలోని ప‌లు రాజ‌కీయ ప‌క్షాల నాయ‌కులు.. ఏపీ స‌ర్కారు తీరుపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డి బాబుకు మ‌ద్ద‌తుగా మాట్లాడారు. చంద్రబాబుపై వైసీపీ నేత‌లు మాట్లాడిన మాటలు సరి కాదని అన్నారు. రాజకీయాల్లో ఎత్తు పల్లాలు కామనేన‌ని తెలిపారు. కానీ వ్యక్తిగత దూషణలు సరి కాదని హిత‌వు ప‌లికారు.

“ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాల నాయకులు కలిసి పని చేసే వాళ్ళం. ప్రతిపక్షం సమస్యలు లేవనెత్తిన.. హుందా తనం తో పని చేశారు. చంద్ర బాబునీ వైఎస్ ఓ సారి ఓ మాట అంటే… రికార్డ్ నుండి తొలగించండి అని వైఎస్ చెప్పారు. జగన్ సమక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్యే లు చంద్రబాబు మీద విమర్శలు చేయడం చూశా. మా గొంతు కెసిఆర్ నొక్కేస్తూ ఉన్నారు. కానీ వ్య‌క్తిగ‌త దూషణలు ఇక్కడ లేవు” అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అంతేకాదు.. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు.. అసెంబ్లీలో ఇలాంటి ప‌రిస్థితి తాను చూడ‌లేద‌న్నారు. “చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం చాలా మంది నాయకులకు ఇబ్బందిగానే అనిపించింది. రాజకీయ కుట్రలు… కుతంత్రాలు ఉంటాయి. కానీ, చంద్రబాబుకి వయసు రీత్యా అయినా..గౌరవం ఇవ్వాల్సింది. వ్యక్తిగత దూషణలు మంచిది కాదు. అదే మాట జగన్ నో.. నానీనో అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి.

స్పీకర్ కుర్చీ సీఎం ఇచ్చినా.. ప్రతిపక్ష నాయకుడి కుటుంబం పై దూషణలు చేస్తుంటే చూస్తూ ఉన్నారు. ఇది స‌రికాదు. స్పీకర్ గా తమ్మినేని అన్ ఫిట్. బాబును తిట్టేటప్పుడు… జగన్ ‘నవ్వు’ దేనికి సంకేతం?. వచ్చే ఎన్నికల్లో బాబుని ప్ర‌జ‌లు గెలిపిస్తే… నీ పరిస్థితి ఎంటి జగన్?” అని ప్ర‌శ్నించారు.

మొత్తంగా జ‌గ్గారెడ్డి ఒక్క‌రే కాదు.. పార్టీల‌కు అతీతంగా కొంద‌రు నాయ‌కులు వాట్సాప్‌లో చాట్ చేస్తున్నారు. అధికార‌ టీఆర్ ఎస్‌కూడా ఈ ప‌రిస్థితిని నిశితంగా గ‌మ‌నిస్తోంది. అయితే.. ఎలాంటి లైన్ తీసుకుంటార‌నేది వేచి చూడాలి. ఏదేమైనా..ఏపీలో విప‌క్ష పార్టీలు ఒకింత వెనుకంజ వేసిన స‌మ‌యంలో తెలంగాణ నుంచి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ల‌భించ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో ఒక్క జ‌న‌సేన మాత్రమే ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడిని ఖండించ‌డం గ‌మ‌నార్హం.