రైతుల‌పై ప్రేమ కురిపించిన మోడీ.. ఫుల్ స్పీచ్ ఇదే

దేశ‌వ్యాప్త రైతాంగంపై గ‌డిచిన 9 నెలల కాలంగా తీవ్ర మౌనం పాటించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఆక‌స్మికంగా.. గ‌ళం విప్పారు. నిజానికి ఈ ఏడాది జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం మూడు వ్య‌వ‌సాయ నూతన చ‌ట్టాలు తీసుకువ‌చ్చింది. వీటిలో కార్పొరేట్ రంగాన్ని ప్రోత్స‌హించేలా.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంద‌ని.. రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ చ‌ట్టాల‌ను అధ్య‌యనం చేసిన‌.. మేధావులు కూడా త‌ప్పుబ‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ.. మోడీ స్పందించ‌లేదు. కానీ, తాజాగా ఆయ‌న రైతుల‌పై ప్రేమ కురిపించారు.

గురునాన‌క్ జ‌యంతి ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం ప్ర‌ధాని జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. ప్ర‌జ‌లందరికీ గురునాన‌క్ జ‌యంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ క్ర‌మంలో రైతుల ఇబ్బందులు ద‌గ్గ‌ర‌నుండి చూశాన‌ని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక వ్య‌వ‌సాయ రంగానికి ప్రాధాన్యం పెంచిన‌ట్టు తెలిపారు. దేశంలో 80శాతం మంది చిన్న స‌న్న‌కారు రైతులేన‌న‌ని, వారికి మేలు క‌లిగే నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే రైతుల‌కు ల‌బ్ధి క‌లిగేలా భూసార ప‌రీక్ష‌లకు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు.

కోట్లాదిమంది రైతుల‌కు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశామ‌న్నారు. రైతుల‌కు పెట్టుబ‌డి సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌చేస్తున్నామ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయ మౌలిక వ‌స‌తులు పెంచుతు న్నామ‌ని వివ‌రించారు. వ్య‌వ‌సాయ‌రంగంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చామ‌ని తెలిపారు. మైక్రో ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై దృష్టిసారించామ‌ని మోడీ వివ‌రించారు. రైతుల‌కు రుణాలివ్వ‌డాన్ని సుల‌భ‌త‌రం చేశామ‌ని పేర్కొన్నారు. రైతుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతున్నామ‌న్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా సుల‌భంగా రుణాలు పొందేలా రైతుల‌కు వెసులుబాటు క‌ల్పించిన‌ట్టుచెప్పారు.

అంతేకాదు.. చిన్న రైతుల అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని ప్ర‌ధాని మోడీ వివ‌రించారు. రైతుల సంక్షేమ‌మే తొలి ప్రాధాన్యమ‌ని వివ‌రించారు. రైతుల క‌ష్టాలు తీర్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ప‌దికోట్ల‌కు పైగా చిన్న‌, స‌న్న‌కారు రైతులున్నారని, గ‌త ప్ర‌భుత్వాలు రైతుల సంక్షేమాన్ని నిర్ల‌క్ష్యంచేశాయ‌ని వివ‌రించారు. ఈ క్ర‌మంలో తాము తీసుకువ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే.. అదేస‌మ‌యంలో ఈ మూడు చ‌ట్టాలు కూడా రైతుల‌కుప్ర‌యోజ‌నక‌ర‌మేన‌ని ముక్తాయించ‌డం గ‌మ‌నార్హం. ఇత‌మిత్థంగా ప్ర‌ధాని ప్ర‌సంగం మొత్తం అన్న‌దాతల చుట్టే తిర‌గ‌డం గ‌మ‌నార్హం.