ఈటల చేసిందేంటి? చంద్రబాబు చేయనిదేంటి?

వైసీపీ అనుకున్నదే సాధించింది. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొడతామని ప్రకటించి.. కుప్పంలో వైసీపీ జెండాను పాతారు. చంద్రబాబు సామ్రాజ్యాన్ని మెల్లిమెల్లిగా వైసీపీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఈ పని ఇప్పటికిప్పుడు ప్రారంభమైంది కాదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పంపై వైసీపీ కన్నేసింది. కుప్పంలో చంద్రబాబుకున్న ఇమేజ్ ను వైసీపీ తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా కుప్పంలో పాగా వేసింది.


రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. నియోజకవర్గంలో వరుస అపజయాలను మూట కట్టుకున్న చంద్రబాబు ఏమాత్రం జాగ్రత్త వహించలేదు. దాని ఫలితమే ఆయన కంచుకోటకు బీటలు పారేటట్లు చేసింది. కుప్పం ఎన్నికల్లో ఓటమికి చంద్రబాబే కారణమనే విమర్శలు ఊపందుకున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబు.. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను అనుసరించిన వ్యూహాన్ని ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చంద్రబాబు కుప్పంలో ఏడు సార్లు విజయం సాధించారు. 40 ఏళ్లుగా నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. అసలు కుప్పంలో ఎన్నికలే జరపకుండా ఏకగ్రీవం చేసుకుంటూ తనకు ఎదురేలేదని అనిపించుకున్నారు. అంతలా కుప్పం ప్రజలు ఆయనను ఆదరించారు. అలాంటి చోట ఇప్పడు టీడీపీకి వరుస అపజయాలతో దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశారు. ఇన్నిసార్లు టీడీపీకి పట్టం కట్టిన జనాలు ఇప్పుడిప్పుడే ఆ పార్టీపై వ్యతరేకత పెంచుకుంటున్నారు. వ్యతిరేక అంటే ఓట్ల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

1989 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా విజేతగా నిలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల ముందు నుంచే వైసీపీ ఈ స్థానంపై దృష్టి సారించింది. ఆ ఫలితం వల్ల చంద్రబాబు మెజార్టీ 30 వేలకు పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కుప్పంలో చంద్రబాబు ఓడిస్తామని పదేపదే వైసీపీ నేతలు చెబుతున్నారు. వారు చెబుతున్నట్లే పంచాయతి ఎన్నికల్లో టీడీపీకి షాకిచ్చారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అదే పరిస్థితి ఎదురైంది.

కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీల్లో 63 స్థానాలను గెలుచుకుంది, నాలుగు జెడ్పీ స్థానాలను నాలుగు ఎంపీపీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇదే విజయ గర్వంతో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో వైసీపీ తలపడింది. మొత్తం 25 వార్డుల్లో వైసీపీ 19 చోట్లు గెలిచింది. అయితే పంచాయతీ, పరిషత్ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్న చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలను మాత్రం సీరియస్ తీసుకున్నారు. మూడు రోజులు కుప్పంలో ప్రచారం చేశారు. లోకేష్ కూడా రెండు రోజులు ప్రచారం చేశారు. పార్టీ నేతలను మోహరించినా ఫలితాలు మాత్రం టీడీపీకి వ్యతిరేకంగా వచ్చింది.

కుప్పంలో వరుస ఓటములకు చంద్రబాబు చేస్తున్న తప్పులేనని పరిశీలకులు చెబుతున్నారు. కుప్పంలో సీనియర్‌ నాయకత్వంపై చంద్రబాబుకు నేరుగా స్థానిక నేతలు పలు ఫిర్యాదులు చేశారు. తమను పట్టించుకోవడంలేదని అధికార పార్టీ నాయకులతో అంటకాగుతున్నారని వాపోయారు. దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా తమకు అండగా నిలవడంలేదని ఆక్రోశించారు. వారి ఆవేదన ఆలకించినట్లే చంద్రబాబు కనిపించారు. తర్వాత షరా మామూలేనని.. ఆ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తమ్ముళ్లు చెబుతున్నారు. జనాల్లో కూడా స్థానిక టీడీపీ నేతల వ్యవహారశైలిపై వ్యతిరేకత ఉంది. దీన్ని చంద్రబాబు ఏమాత్రం పసిగట్టలేక పోయారనే ఆరోపణలున్నాయి.

కుప్పంలో చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ కావడానికి ఆయన తప్పిందమేననే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుకు కుప్పంలో తనకుంటూ స్వంత మనుషులు లేకపోవడం పెద్దలోటని చెబుతున్నారు. కుప్పంలో అధికార పార్టీ దొంగ ఓట్లు వేసుకుందని, దౌర్జన్యాలకు దిగిందని ఇలా అనేక ఆరోపణలు చేశారు.

ఇలాంటి పరిస్థితే హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు ఎదురైంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని చేసినా చివరికి ఈటల గెలిచారు. హుజురాబాద్ లో ఈటలకు తనకంటూ స్వంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన వర్గంతో పాటు స్థానిక నేతల బలంతోనే ఆయన గెలిచారు. అయితే ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు స్వంత నియోజకవర్గంలో ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతోందనే విమర్శలు వస్తున్నాయి. తనకోసం నిలబడే స్వంత నేతలను చంద్రబాబు తయారు చేసుకోకపొవడం వల్ల ఇలా జరుగుతోందని చెబుతున్నారు.