టీడీపీని నంద‌మూరి కుటుంబానికి ఇచ్చేయాలి: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం మునిసిపాలిటీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. దీనిపై.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుని, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు పార్టీని అప్పగిస్తే మంచిదని హితవు పలికారు. 72 సంవత్సరాల వయస్సుతో ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు తన ఓటు వున్న నియోజకవర్గం నుంచి కూడా కుమారుడు లోకేష్ గెలవలేదనే బాధతో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి తన ఆరోగ్యంను కాపాడుకోవడం మంచిదని సూచించారు. సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఇంకా రాజకీయాల్లోనే ఉంటానంటే అది ఆయన ఇష్టమని అన్నారు.

కుప్పం ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారని, లోకేష్ తన స్థాయిని మించి మాట్లాడారని మండిపడ్డారు. లోకేష్ ఇలాగే మాట్లాడితే ఇకపై సహించేది లేదని, తగిన విధంగా స్పందన ఉంటుందని హెచ్చరించారు. లోకేష్ మాట్లాడిన మాటలకు కుప్పం ప్రజలు రెండు చెంపలు వాయించి, ఇకపై మా ఊరికి రావద్దని తీర్పు చెప్పారని అన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో పోటీ చేస్తాడని అనుకోవడం లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఒకవేళ పుంగనూరు నుంచి పోటీ చేయడానికి చంద్రాబు ఉత్సాహం చూపితే అందుకు స్వాగతిస్తానని అన్నారు.

ఆనాడు కాంగ్రెస్‌లో ఉండి ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ.. చంద్రబాబు ప్రగల్భాలు పలికాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తరువాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కుని, చివరికి ఆయనను పదవి నుంచి దింపేసి, ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమయ్యాడని విమర్శించారు. నేడు తెలుగుదేశం పార్టీని తన అసమర్థతతో నిర్వీర్యం చేస్తున్నాడని అన్నారు. సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి ప్రజలు పట్టం కట్టారని రామచంద్రారెడ్డి అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాల ఫలితమే ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ విజయమని అన్నారు. కుప్పం ప్రజలు ఛీ కొట్టిన తరువాత ఇంకా కుప్పం గురించి చంద్రబాబు మాట్లాడతాడని తాము భావించడం లేదన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవడానికి టీడీపీ అనేక దౌర్జన్యాలకు పాల్పడిందని గుర్తు చేశారు. చివరికి చంద్రబాబు హైకోర్ట్‌కు వెళ్ళి ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించుకునేలా ఉత్తర్వలు తెచ్చుకున్నరని అన్నారు. ప్రజలు వైసీపీకి అండగా ఉంటే, డబ్బు పంపిణీ చేశామంటూ మాపైన తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.