బీజేపీకి భారీ మైనస్ ?

తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మైనస్ లు తప్పేట్లు లేదు. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ జరిపిన సర్వేలో పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోను కమలం పార్టీయే అధికారంలోకి వస్తుందని ఓ అంచనా. అయితే అన్ని రాష్ట్రాల్లోను పెద్ద మైనస్ తప్పేట్లు లేదని స్పష్టంగా కనబడుతోంది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ పరిస్ధితి ఎలాగున్నా ఉత్తరప్రదేశ్ లో మాత్రం పెద్ద ఎత్తున సీట్లను కోల్పోబోతున్నట్లు సర్వేలో బయటపడిందట.

2017లో జరిగిన ఎన్నికల్లో 403 సీట్లలో 325 సీట్ల మెజారిటితో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే తొందరలో జరగబోయే ఎన్నికల్లో కమలంపార్టీకి 217 సీట్లు మాత్రమే వస్తుందని సర్వేలో తేలింది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినా పెద్ద ఎత్తున సీట్లలో కోత అయితే పడటం ఖాయమని తేలిపోయింది. ఒకేసారి 108 సీట్లు తగ్గిపోతున్నట్లు సర్వేలో తేలిందంటే యోగి సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత స్పష్టమవుతోంది.

ఇక 70 స్ధానాలున్న ఉత్తరాఖండ్ లో, 40 స్ధానాలున్న గోవాతో పాటు 60 సీట్లున్న మణిపూర్ లో కూడా బీజేపీ బలం బాగా తగ్గిపోతుందట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ కన్నా కేవలం కొద్దిసీట్ల మెజారిటితో మాత్రమే బీజేపీ అధికారంలోకి రాబోతోందని సర్వే రిజల్టు చెబుతోంది. అయితే బీజేపీ-కాంగ్రెస్ మధ్య తేడా చాలా తక్కువ మాత్రమే ఉండబోతోందటంటే రేపటి ఎన్నికల్లో ఈ తేడా మారిపోయినా ఆశ్చర్యంలేదు.

పై మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతున్న బీజేపీ కాంగ్రెస్ కన్నా కేవలం 10 నుంచి 15 సీట్ల ఆధిక్యతతో మాత్రమే సాధించబోతున్నట్లు సర్వేలో తేలింది. అయితే ఎన్నికల సమయానికి ఈ తేడాలో మార్పులు వచ్చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే సర్వే రిపోర్టులన్నీ ప్రతిసారి వాస్తవం అవుతుందని అనుకునేందుకు లేదు.

కాంగ్రెస్ పై రాష్ట్రాల్లో అధికారంలోకి రాకపోయినా సీట్లను గణనీయంగా పెంచుకుంటోందని సర్వేలో తేలింది. ఇపుడు ఎలాగు అధికారంలో కాంగ్రెస్ లేదుకాబట్టి రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా నష్టమేమీ ఉండదు. అయితే పెరుగుతాయని అనుకుంటున్న సీట్ల వల్ల పార్టీకి లాభమే అనుకోవాలి. అయితే పంజాబ్ లో అధికారం కోల్పోబోతున్నట్లు సర్వేలో తేలింది. ఇక్కడ ఆమ్ ఆదీ పార్టీ (ఆప్) అత్యధిక సీట్లతో సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలబడుతుందని తేలింది. మొత్తంమీద బీజేపీకి సీట్లు తగ్గిపోయి, కాంగ్రెస్ పుంజుకుంటుందని సర్వేలో తేలింది.