శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు


ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ, కర్నాటక సరిహద్దు వివాదం తేలేంతవరకూ తనపై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసుపై దర్యాప్తును నిలిపివేయాలని శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను తొమ్మిదేళ్లుగా సీబీఐ సాగదీస్తుందంటూ ఆమె తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐ జాప్యం చేస్తుందని కోర్టు దృష్టికి న్యాయవాది తెచ్చారు. వాదనలు విన్న కోర్టు శ్రీలక్ష్మి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఇటీవల జగన్‌ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మిపై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దాల్మియా సిమెంట్స్‌ కేసులో విచారణకు తరచూ హాజరు కాకపోవడంతో శ్రీలక్ష్మిపై న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. కోర్టు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి, ఓబుళాపురం గనుల కేసులో అరెస్టయి, సస్పెన్షన్‌కు గురయ్యారు.

తెలంగాణ కేడర్ కు చెందిన శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం 2021 జనవరి 18న ఆమెకు ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆమెపై పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో తీర్పునకు లోబడి ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. శ్రీలక్ష్మి 2026 జూన్‌ 30 వరకూ ఆమె సర్వీసులో ఉంటారు. ముందుగా ఆమెకు ఏపీ సచివాలయంలో పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అదే శాఖలో ఆమెకు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.