పతి, పత్ని మధ్యలో కియారా

భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల తర్వాత తెలుగులో కనిపించడం మానేసిందేమోగానీ.. బాలీవుడ్‌లో మాత్రం బ్యాండ్ బజాయిస్తోంది కియారా అద్వానీ. వరుస అవకాశాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. చంద్రముఖి చిత్రానికి హిందీ రీమేక్‌ అయిన ‘భూల్‌ భులయ్యా’కి సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో కియారానే హీరోయిన్. వరుణ్ ధావన్‌తో ‘జుగ్‌జుగ్‌ జియో’ అనే మరో సినిమా కూడా చేస్తోంది. ఇవి ఓకే కానీ.. ఓ సినిమాలో మాంచి మసాలా రోల్ ఒకటి చేయబోతున్నట్టు తెలిసింది.

పోయినేడు విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్‌‌ ప్రధాన పాత్రల్లో ‘మిస్టర్ లేలే’ అనే మూవీని అనౌన్స్ చేశాడు కరణ్ జోహార్. శశాంక్ ఖేతన్ దర్శకుడు. ఇలా మొదలు పెట్టారో లేదో అలా మూవీకి బ్రేక్ పడింది. కోవిడ్ వల్ల వచ్చిన మార్పులు, ఇబ్బందులతో నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కాక అప్పటికి సినిమా వాయిదా వేశారు. ఇప్పుడు అదే సినిమాని మరో టైటిల్‌తో అనౌన్స్ చేశారు.

‘గోవిందా నామ్‌ మేరా’ పేరుతో రానున్న ఈ సినిమాలో విక్కీ యంగ్ హజ్బెండ్‌గా, భూమి అతనికి భార్యగా నటిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య గొడవలకి కారణమయ్యే నాటీ గాళ్‌ఫ్రెండ్‌గా కియారా కనిపించబోతోందని మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. మొగుడూ పెళ్లాల మధ్యలోకి వచ్చే పరాయి అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. మరి అలాంటి పాత్రలో చేస్తోందంటే ఆమె క్యారెక్టర్‌‌లో మంచి మసాలా ఉంటుందని ఊహిస్తున్నారంతా.

మరోవైపు శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో రామ్‌ చరణ్‌కి జోడీగా నటిస్తోంది కియారా. రీసెంట్‌గా ఒక షెడ్యూల్ కంప్లీటయ్యింది. త్వరలో మరో షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో చీఫ్ మినిస్టర్‌‌గా మారిన ఐఏఎస్‌ ఆఫీసర్‌‌గా చరణ్ నటిస్తుంటే.. కియారా ఓ సిన్సియర్ జర్నలిస్టుగా కనిపిస్తుందటని టాక్. మొత్తానికి అటు సీరియస్ రోల్స్‌తో పాటు ఇటు చిలిపి వేషాలకూ సిద్ధపడుతోంది కియారా.