పాద‌యాత్ర ఎఫెక్ట్‌.. త‌ల‌ప‌ట్టుకుంటున్న జ‌గ‌న్‌..!


వైసీపీ అధినేతకు పాద‌యాత్ర సంక‌టం ప‌ట్టుకుందా? ఆయ‌నకు పాద‌యాత్ర త‌ల‌నొప్పిగా మారిందా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు ఔన‌నే అంటున్నారు. అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అడిగిన వారికి అడిగిన‌ట్టు హామీలు కుమ్మ‌రించారు. ఒక్క కాపు సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ త‌ప్ప‌.. మిగిలిన అనేక వ‌ర్గాల‌కు ఆయ‌న హామీలు ఇచ్చారు. దీనిలో ప్ర‌ధానంగా కీల‌క‌మైన ఉద్యోగ వ‌ర్గాల‌కు సీపీఎస్ పింఛ‌న్‌ను ర‌ద్దు చేస్తాన‌ని.. ఆయ‌న చెప్పారు. అదేవిధంగా పీఆర్సీ.. వంటి కీల‌క హామీ కూడా ఇచ్చారు.

అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేయ‌డం కూడా ఇప్పుడు ప్ర‌భుత్వానికి త‌ల‌కు మించిన భారంగా మారింది. వ‌స్తున్న నిధులు వ‌చ్చిన‌ట్టుగానే ఖ‌ర్చయి పోతుండ డం.. ఆదాయం పెంచుకునే మార్గాలు క‌నిపించ‌క‌పోవ‌డం.. ప‌న్న‌లు, సెస్సులు పెంచ‌క‌పోతే..న‌డ‌వ‌ని ప‌రిస్థితి ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఏర్ప‌డింది. దీంతో జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా గ‌త కొద్ది రోజులుగా ఉద్యోగ సంఘాల నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

నిజానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి అనుకూలంగా వాయిస్ వినిపించారు. అయితే.. ఇప్పుడు ఇదే ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాలు.. ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ఉన్నాయి. పీఆర్సీ అమ‌లు కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే.. ఇది వేల కోట్ల రూపాయ‌ల‌తో కూడుకున్న‌ది కావ‌డం.. ఖ‌జానా ఇబ్బందుల్లో ఉండ‌డం తో దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోవ‌డం వంటివి.. క‌నిపిస్తున్నాయి.

ఇదిలావుంటే.. పాద‌యాత్ర స‌మ‌యంలో త‌మ‌కు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేద‌ని.. కూడా ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నాయ‌కుడు.. సూర్య‌నారాయ‌ణ వంటివారు బాహాటంగాఏ ఆరోపిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌భుత్వ అనుకూల పార్టీగా టీడీపీ ఒక్క‌టే నిలిచింద‌నే వాద‌న ఉద్యోగుల్లో వినిపిస్తోంది. దీంతో ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. వైసీపీ నాయ‌కులు భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.