మోడీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా ?

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ నరేంద్రమోడీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. యూపీలో లఖింపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్రమంత్రి మిశ్రా కొడుకు వాహనం దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అసలే రైతు సంఘాల దెబ్బకు అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ పరిస్థితి లఖింపూర్ ఖేరి ఘటనతో మరింత దిగజారిపోయింది. ఈ నేపధ్యంలోనే యూపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చే విషయంలో మోడీ టెన్షన్ పెరిగిపోతోందట.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టబోతున్నారు. అంతా ఇంతా కాదు ఏకంగా లక్ష కోట్ల రూపాయలను ఒక్క యూపీలో మాత్రమే ఖర్చు చేయడానికి కేంద్రం రెడీ అయిపోయింది. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత మొత్తుకున్నా పెద్దగా పట్టించుకోని మోడీ తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం నిధుల వరద పారిస్తున్నారు. ఎన్నికల కోడ్ ప్రకటించకముందే ఆ లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేయాలని మోడీ యమా తొందర పడుతున్నారు.

అందుకనే ఈ నెలలో మోడీ నాలుగుసార్లు యూపీలో పర్యటించబోతున్నారు. ఈనెల 16వ తేదీన గోరఖ్ పూర్-పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు ఖరీదే రు. 42 వేల కోట్లు. ఇక 19వ తేదీన ఝాన్సీ లక్ష్మీబాయి 193వ జయంతి వేడుకలు, 20వ తేదీన లక్నోలో జరగనున్న డీజీపీల వార్షిక సమావేశంలో పాల్గొంటారు. అలాగే 25వ తేదీన నోయిడా సమీపంలో జేవార్ ఎయిర్ పోర్టు శంకుస్థాపన చేయనున్నారు. మళ్ళీ డిసెంబర్ లో తన నియోజకవర్గం వారణాశిలో విశ్వనాథ టెంపుల్ కారిడార్ ప్రారంభోత్సవం లో పాల్గొంటారు.

ఇన్నిసార్లు యూపీకి మోడి వస్తున్నారంటేనే అసెంబ్లీ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకన్నారో అర్ధమైపోతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటినట్లు ప్రతిపక్షాలు ఎప్పటినుండో ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో లఖింపూర్ ఖేరి ఘటన జరగటం ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారింది. పైగా ఘటనను మాయ చేద్దామని ప్రయత్నించినపుడు సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీయే ఘటన తాలూకు వీడియోలను రిలీజ్ చేయడం మరింత ఇబ్బందిగా మారింది. రాష్ట్ర నేతలు పట్టించుకోకపోయినా మోడికి మాత్రం యూపీ ఎన్నికల్లో పార్టీని గెలిపించక తప్పేట్లు లేదు.

మూడు వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ తో భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమంలో యూపీ రైతులది కూడా కీలకపాత్రే. యూపీలోని జాట్ కులస్తుల్లో కిసాన్ సంఘ్ నాయకుడు రాకేష్ తికాయత్ కు తిరుగులేని పట్టుంది. తికాయత్ నేతృత్వంలో రైతులంతా బీజేపీకి వ్యతిరేకమయ్యారు. అంటే ఒకవైపు రైతు ఉద్యమం, మరోవైపు లఖింపూర్ ఖేరీ ఘటన, మరోవైపు ప్రతిపక్షాలు, చివరకు జనాల్లో వ్యతిరేకత. ఇన్నింటి మధ్య మళ్ళీ బీజేపీని మోడీ ఎలా పవర్లోకి తీసుకొస్తారో చూడాల్సిందే.