మంత్రిగారి జోక్యం.. ఆ సినిమా థియేట‌ర్ల‌లోకి

మ‌ర‌క్కార్: ది ల‌య‌న్ ఆఫ్ అరేబియ‌న్ సీ.. మోహ‌న్ లాల్ హీరోగా మ‌ల‌యాళంలో వంద కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోనే అత్య‌ధిక ఖ‌ర్చుతో, అత్యంత భారీత‌నంతో తీర్చిదిద్దిన చిత్రం. విడుద‌ల‌కు ముందే జాతీయ అవార్డుల్లో పోటీ ప‌డి ఉత్త‌మ జాతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.

ఇలాంటి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటే అభిమానుల మన‌స్సు చివుక్కుమంటోంది. కేర‌ళ‌లో క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే ఎక్కువ‌గా ఉండ‌టం, థియేట‌ర్ల విష‌యంలో ఆంక్ష‌లు చాలా కాలం పాటు కొన‌సాగ‌డంతో అక్క‌డ పెద్ద పెద్ద సినిమాల‌న్నింటినీ ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. కేర‌ళ థియేట‌ర్ మార్కెట్ చిన్న‌ది కావ‌డం వ‌ల్ల కూడా ఓటీటీ బాట ప‌డుతుండ‌టానికి ఓ కార‌ణ‌మే. కానీ మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌కు బాహుబ‌లి లాంటి మ‌ర‌క్కార్ సినిమాను పెద్ద తెర‌ల్లో కాకుండా స్మాల్ స్క్రీన్ మీద చూడాల్సి రావ‌డం అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు రుచించ‌డం లేదు.

దీంతో మ‌రక్కార్ థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగా డిమాండ్లు చేస్తున్నారు. బ‌య‌ట కూడా మోహ‌న్ లాల్ అభిమానులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో కేర‌ళ సాంస్కృతిక శాఖా మంత్రి సాజి చెరియ‌న్ ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకున్నారు. మ‌ర‌క్కార్ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేలా ఆయ‌న ఇటు సినిమా నిర్మాత‌లు, అటు ఓటీటీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

స్వ‌యంగా ఆయ‌నే ఈ సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ గురించి తాజాగా ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం. ఈ చిత్రాన్ని వెండితెర‌ల్లోనూ చూడొచ్చ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఐతే ఇంకా రిలీజ్ డేట్ ఖ‌రారు కాలేద‌ని తెలిపారు. మాలీవుడ్ అంచ‌నాల ప్ర‌కారం డిసెంబ‌రు 2న మ‌ర‌క్కార్ ఇటు థియేట‌ర్ల‌లో, అటు ఓటీటీలో ఒకేసారి విడుద‌ల‌వుతుంద‌ని భావిస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది.