అచ్చిరాని ఆరోగ్యశాఖను హరీష్‌కు కట్టబెట్టారేంటి..

తెలంగాణ ఆరోగ్య శాఖ అంటే హడలెత్తిపోతున్నారు.. బాబోయ్.. ఆ శాఖకే సుస్తీ చేసింది.. దీర్ఘకాల వ్యాధితో భాదపడుతోందనే టాక్ ఉంది. 2014 నుంచి ఇప్పుటి వరకూ అంటే ఏడేళ్లు ఆనారోగ్యంతో ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికి ఆరోగ్యశాఖకు దీర్ఘకాల వ్యాధి నుంచి రక్షించే వారే కరువయ్యారు.

ఆది నుంచి ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన నేతలందరికీ ఊహించని షాకులే తగిలాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ ఒక్కరంటే ఒక్కరికీ అచ్చిరాలేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.. ఈ శాఖకు ఇప్పటి వరకూ ఎంత మంది మంత్రులు మారారో లెక్కేలేదు.. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఇప్పుడు హరీష్ రావు చేతికొచ్చింది.. ఇంతకీ ఆయనకే ఎందుకు కట్టబెట్టారు..? అప్పట్లో ఈటల రాజేందర్ చెప్పిన జోస్యం ఇప్పుడు అక్షరాలా నిజం కానుందా..? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆది నుంచీ వైద్య శాఖ వివాదాస్పదంగా ఎందుకు మారుతోంది.

2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీఆర్‌ఎస్ మొదటిసారిగా అధికారాన్ని ఏర్పాటు చేసింది. టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆయనపై ఆరోపణలు రావడంతో ఎనిమిది నెలల కూడా పూర్తి కాకుండానే మంత్రివర్గం నుంచి తొలగించారు. అప్పటికే రాజయ్య ఉప ముఖ్యమంత్రి కూడా. ఏకకాలంలో రెండు పదవులకు ఉద్వాసన పలికారు.

రాజయ్య తర్వాత డాక్టర్ లక్ష్మారెడ్డికి ఆ బాధ్యతలు అప్పుగించారు. ఆయన పదవిలో కూర్చున్నప్పటి నుంచి ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. ఆయన వైద్య పట్టాపై అనేక విమర్శలు చేశారు. లక్ష్మారెడ్డి వైద్యుడు కాదని, ఆయన అసలు డాక్టర్ కాదని, ఆయన పేక్ సర్టిఫికేట్ తో వైద్యుడిగా చలామణి అవుతున్నారని ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు లక్ష్మారెడ్డిని చుట్టుముట్టాయి. ఈ వివాదాల మధ్యే లక్ష్మారెడ్డి తన టర్మ్ ను ఎలాగోల ముగించారు.

ఇక రెండో సారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈటల రాజేందర్ కు ఆరోగ్యశాఖ కట్టబెట్టారు. 2019లో ఈటల బాధ్యతలు చేపట్టారు. 2021 మే 2న కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయ్యారు. కరోనా సమయంలో ఆరోగ్య శాఖా నిర్వాహణపై అనేక విమర్శలు వచ్చాయి. కరోనా రోగులకు వసతులు, వ్యాధిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రుల నిర్వహణ.. ఇలా అనేక సమస్యలు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో చుట్టుముట్టాయి. కరోనా అసాధారణ స్థితి నుంచి ఈటల బయటపడ్డారు. అయితే ఆయన మరో రూపంలో మంత్రి వర్గం నుంచి భర్తరప్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఈటల టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. ఆ వెనువెంటనే బీజేపీలో చేరడం అంతా చకచకా జరిగిపోయాయి. హుజురాబాద్ ఎన్నిక, బీజేపీ గెలుపు.. ఇలా అన్ని జరిగిపోయాయి. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.

టీఆర్‌ఎస్ ఓటమి తర్వాత హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అభిప్రాయాలను పక్కన పెట్టి ఆయనకు ఈటల నిర్వహించిన ఆరోగ్యశాఖ అదనపు బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. మంగళవారం రాత్రే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం.. గవర్నర్ ఆమోదంతో అంతా క్షణాల్లో జరిగిపోయాయి. ఈటల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందే ఈ పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి.

అయితే హరీష్ రావును టార్గెట్ చేసుకుని అచ్చిరాని ఆరోగ్యశాఖను కేటాయించారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశాఖ గండంగా మారింది. ఆ శాఖ నిర్వహించిన అందరూ అనతికాలంలోనే పదవులు కోల్పోయారు. తాడికొండ రాజయ్య మొదలు కొని ఈటల వరకు అందరనీ వివిధ కారణాలతో తొలగించారు.

ఇంత వివాదాస్పదంగా ఉన్న ఆరోగ్యశాఖను ఇప్పుడు హరీష్ రావుకు అప్పగించడం చర్చకు దారి తీస్తోంది. అంతేకాదు ఈటల నిర్వహించిన ఆర్థిక, ఆరోగ్య శాఖలను హరీష్ రావు నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిలక ప్రచారంలో ‘నాకు పట్టిన గతే హరీష్ రావుకూ పడుతుంది’అని ఈటల జోస్యం చెప్పారు. ఇలాంటి సమయంలో ఈ రెండు శాఖలను హరీష్ రావు సమర్దవంతంగా నిర్వహిస్తారా? లేక అందరూ అనుకున్నట్లు మధ్యలో ఆయనను కూడా తొలగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.