తగ్గేదే లా… జగన్ సర్కారుపై ఉద్యోగ సంఘాల తిరుగుబాటు

ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాయి. సీఎం జగన్ గెలిపించుకుని తాము తీసుకున్న గోతిలో తామే పడ్డామని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు మూకుమ్మడి దాడికి దిగుతున్నాయి.

వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. వారం రోజుల్లో నివేదిక ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చి రోజులు గడిచిపోతున్నా.. ఇప్పటికీ నివేదిక ఇవ్వకపోవడంతో బుధవారం ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఉద్యోగులంతా జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించారని, అయినప్పటికీ తమ సమస్యలను సీఎం ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ దుయ్యబట్టారు. రెండున్నరేళ్లలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తప్పుబట్టారు.

ఎప్పుడో ఒకప్పుడు జీతాలు ఇస్తున్నాం కదా అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బుగ్గన ఉద్యోగులను కించపరుస్తున్నారని ఆక్షేపించారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయని సూర్యనారాయణ విమర్శించారు. ఉద్యోగుల జీతం నుంచి దాచుకున్న సొమ్ము జీపీఎఫ్‌ ఖాతాల్లో ఉంటుందన్నారు. ఈ సొమ్మును అవసరానికి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉద్యోగులకు ఉందని స్పష్టం చేశారు.

ఇది సాలీనా రూ.8-10 కోట్ల సొమ్ము ఉంటుందని తెలిపారు. ఈ సొమ్మును ఎక్కడైనా మదుపు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేశారు. ఆఖరికి ఈ హక్కును కూడా ప్రభుత్వం హరించి, జీపీఎఫ్ ను ఆదాయంగా మలుచుకుంటోందని ఆయన విమర్శించారు.

ఉద్యోగుల సీపీఎస్‌ రద్దుతో పాటు, డీఏల చెల్లింపు, పీఆర్‌సీ అమలు.. రెండున్నరేళ్లలో ఒక్కహామీ కూడా నెరవేరలేదని దుయ్యబట్టారు. పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను కొన్ని సంఘాలు మభ్య పెడుతున్నాయని ఆరోపించారు. వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా తాము కొనసాగలేమని సూర్యనారాయణ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారునిగా ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు చంద్రశేఖరరెడ్డి నియమకాన్ని సూర్యనారాయణ ఆక్షేపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లోని 182 ఎకరాల ఉద్యోగుల భూములను చంద్రశేఖరరెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి ఆయనపై కేసు పెట్టిందని గుర్తుచేశారు. చంద్రశేఖర్ రెడ్డిపై అప్పట్లో ప్రభుత్వమే కేసు పెట్టిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల సలహాదారుగా ఎలా నియమిస్తారని సూర్యనారాయణ ప్రశ్నించారు.