ఎయిడెడ్ స్థ‌లాల‌పై జ‌గ‌న్ క‌న్ను.. నారా లోకేష్ ఫైర్‌

జ‌గ‌న్ పాల‌న‌లో విద్యార్థుల భ‌విష్య‌త్తు నాశ‌నం అయిపోతోంద‌ని.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంతపురంలో ఎయిడెడ్ పాఠశాలల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్ర‌క‌టించిన లోకేష్‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. జ‌గ‌న్ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును.. సీఎం జగన్ అగమ్యగోచరంగా మార్చారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు.. ఒక మాట‌.. త‌ర్వాత‌.. ఒక చేత అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ పథకాలన్నింటికీ జగన్‌ పేరు పెట్టడమేంటని నారా లోకేశ్ అనంతపురం పర్యటనలో అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. కేవలం విధ్వంసం మాత్రమే నడుస్తోందని విమర్శించారు. ఎయిడె డ్‌ కళాశాల భూములపై సీఎం జగన్‌ కన్నేశారని ఆరోపించారు. ఎలాగైనా స‌రే.. ఆయా ఆస్తుల‌ను భూములను కూడా వ‌శ‌ప‌రుచుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టికే చాలా భూముల‌ను అధికార పార్టీ నేత‌లు ఆక్ర‌మించుకున్నార‌ని.. లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎయిడెడ్‌ కళాశాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వచ్చారని నారా లోకేశ్ వివరించారు.

2 వేలకు పైగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2 లక్షల మంది, 182 జూనియర్ కళాశాలల్లో 71 వేల మంది విద్యార్థులున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా లోకేష్‌తో విద్యార్థులు ముఖాముఖి మాట్లాడారు. అందరికీ ఉచిత విద్య అంటూ సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని వారు.. నిలదీశారు. విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేస్తే వేలకు వేలు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నించారు. దీనికి స‌మాధానం సీఎం జ‌గ‌నే చెప్పాల‌ని.. విద్యార్తులు నిల‌దీశారు.

మ‌రోవైపు.. లోకేష్ ప‌ర్య‌ట‌న‌కు ఎనలేని స్పంద‌న ల‌భించింది. అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌లో అనేక మంది నాయ‌కులు.. విద్యార్థి సంఘాలు.. లోకేష్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. విద్యార్థులు.. పెద్ద ఎత్తున నినాదాల‌తో లోకేష్‌కు స్వాగ‌తం ప‌లికారు. కార్యక్రమంలో పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు. వీరితోపాటుగా పలు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.