ఎన్టీఆర్ కూడా రక్షించేలా లేడు


హిందీలో సూపర్ హిట్టయి ట్రెండ్ సెట్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రాంలో సౌత్‌లో మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. తమిళంలో గతంలో శరత్ కుమార్ హోస్ట్‌గా కొంత కాలం ప్రసారం అయిన ఈ షో.. తర్వాత ఆగిపోయింది. తెలుగులో అక్కినేని నాగార్జున కొన్నేళ్ల పాటు విజయవంతంగానే షోను నడిపించారు. తర్వాత దానికి రేటింగ్స్ పడిపోయాయి. చిరంజీవి ఒక సీజన్లో షోను హెస్ట్ చేయగా.. అప్పుడు మరింతగా రేటింగ్స్ దెబ్బ తిన్నాయి. దీంతో స్టార్ మా ఛానెల్ ఈ షోను ఆపేసింది.

ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత జెమిని టీవీ ఈ షో హక్కులు తీసుకుని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ పేరు మార్చి.. ‘బిగ్ బాస్’ షో అరంగేట్ర సీజన్లో అదరగొట్టిన తారక్‌ను హోస్ట్‌గా ఎంచుకుని ఈ షోను రీస్టార్ట్ చేసింది. లాంచింగ్ ఎపిసోడ్‌కు అద్భుత స్పందన కనిపించడం, షో చరిత్రలోనే రికార్డు రేటింగ్స్ రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నారు.

కానీ తారక్ ఎంత బాగా షోను హోస్ట్ చేస్తున్నా.. మధ్య మధ్యలో పెద్ద పెద్ద సెలబ్రెటీలను అతిథులుగా తీసుకొస్తున్నా.. బేసిగ్గా ఈ కార్యక్రమం పట్ల ప్రేక్షకుల్లో అంత ఆసక్తి లేదని స్పష్టమవుతోంది. లాంచింగ్ ఎపిసోడ్ తర్వాత క్రమ క్రమంగా రేటింగ్ పడిపోతూ వస్తుండటమే అందుకు నిదర్శనం. తొలి ఎపిసోడ్‌కు 11.4 టీఆర్పీ రేటింగ్ రాగా.. తర్వాతి నాలుగు ఎపిసోడ్లకు వరుసగా 6.76, 6.48, 7.30, 6.59 రేటింగ్స్ వచ్చాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. తర్వాత రేటింగ్స్ పడిపోవడం మొదలైంది. తర్వాతి రెండు ఎపిసోడ్లకు 4.70, 4.00 రేటింగ్స్ రాగా.. ఆపై మరింత పతనం చూసిందీ షో.

చివరి నాలుగు ఎపిసోడ్లకు వరుసగా 3.12, 2.87, 3.17, 2.69 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. స్టార్ మాలో వచ్చే మిగతా ప్రోగ్రాంలకు వచ్చే రేటింగ్స్‌తో పోలిస్తే ఇవి నామమాత్రం. తారక్ ఎంత బాగా షోను నడిపిస్తున్నప్పటికీ.. రేటింగ్స్‌ను పెంచడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ షో ద్వారా డ్రామా పండించడం అంత తేలిక కాదు. నాలెడ్జ్ పెంచే, కొంత మేర ఉత్కంఠ రేపే అవకాశం ఉన్నప్పటికీ జనాలకు షో పట్ల ఆసక్తి తక్కువే అని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తర్వాతి సీజన్‌కు షో కొనసాగుతుందా లేదా అన్నదే డౌట్‌గా మారింది.