కేసీఆర్‌పై కిష‌న్ రెడ్డి ఫైర్‌.. హాట్ కామెంట్స్‌

తెలంగాణ‌లో రెండు రోజుల కింద‌ట ప్రారంభ‌మైన‌.. అధికార పార్టీ టీఆర్ ఎస్ వ‌ర్సెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీజేపీ మ‌ధ్య వార్‌.. కొన‌సాగుతూనే ఉంది. వ‌రుస‌గా ప్రెస్ మీట్‌లు పెట్టిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. బీజేపీపై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేస్తోంద‌ని.. రైతుల‌ను రోడ్డున ప‌డేస్తోంద‌ని..ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనికి కౌంట‌ర్‌గా .. రాష్ట్ర పార్టీ చీఫ్ బండి సంజ‌య్ విమ‌ర్శ లు చేశారు. ఇక‌, తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.. కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డేది లేద‌న్నారు.

సీఎం కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణకు కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. 2014లో ప్రధాని మోడీ ప్రభుత్వం రాక ముందు కేంద్ర ప్రభుత్వం తెలుగురాష్ట్రాల్లో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని… బీజేపీ ప్రభుత్వం 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని వెల్లడించారు. 2014లో తెలంగాణలో 43 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించారన్న కేంద్రమంత్రి… ప్రస్తుతం తెలంగాణలో 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని వివరించారు.

కేసీఆర్‌ నిన్న, మొన్న నిర్వహించిన మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు, ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ కోసం కేంద్రం పెద్దఎత్తున ఖర్చు చేస్తోందని తెలిపారు. రైతుల గన్నీ సంచులకు కూడా కేంద్రమే డబ్బులిస్తోందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వంపై రూపాయి కూడా భారం పడదన్న కేంద్రమంత్రి .. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరిస్తున్నామని… పంజాబ్‌ నుంచి 135 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని… తెలంగాణ నుంచి 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని వివరించారు.

ప్రతి సంవత్సరం కూడా కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ధాన్యం సేకరణకు కేంద్రం రూ.26,640 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. 2014లో ఉన్న రూ.3,400 కోట్ల నుంచి రూ.26,640 కోట్లకు పెంచామని పేర్కొన్నారు. 41 లక్షల మెట్రిక్ టన్నులకే ఒప్పందం చేసుకున్నారన్న కేంద్రమంత్రి… ఇప్పుడేమో 108 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలంటున్నారని అన్నారు. ఇప్పటికీ కూడా రా రైస్ను కేంద్రం కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందన్న ఆయన… సరైన అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

“సీఎం కేసీఆర్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎవరూ తినరు. దేశంలో బాయిల్డ్ రైస్ ఉపయోగం లేకుండా ఉంది. రైతులు కూడా ఎవరూ బాయిల్డ్ రైస్ పండించరు. బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేసేది మిల్లర్లే. రా రైస్ ఇస్తే ఎంతైనా తీసుకుంటామని చెప్పారు. గతేడాది 44.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని కేంద్రం తీసుకుంది. రాబోయే రోజుల్లో దొడ్డు బియ్యాన్ని తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అన్ని రైస్ మిల్లుల్లో రా రైస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటా మని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ధాన్యం ఉత్పత్తిని సరిగా అంచనా వేయలేకపోయింది. ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుందో అంచనా వేయలేకపోతున్నారు. 108 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని సెప్టెంబరు 29న లేఖ రాశారు. కంటిచూపుతో అంచనా వేసినట్లు లేఖలో తెలిపారు. సరైన అంచనా, సర్వే లేకుండా బాధ్యతారహితంగా లేఖ రాశారు” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వైద్య కళాశాలల విషయంలో కూడా అబద్ధాలు చెబుతున్నారని కిష‌న్ రెడ్డి ఆరోపించారు. వైద్య కళాశాలల విషయమై ఎప్పుడైనా కేంద్ర అధికారులతో మాట్లాడారా? అని ప్రశ్నించారు. పెట్రోల్ విషయంలో కూడా అబద్ధాలు చెబుతున్నారు. రూపాయి కూడా అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి. జీఎస్టీ ఆదాయం పడిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో సెస్ పెంచాం. జీఎస్టీ ఆదాయం మెరుగుపడిందనే ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాం. కేంద్రానికి అనేక రకాలుగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. 80 కోట్లమందికి ఏడాది పాటు ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. దేశ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ టీకాలు ఇస్తున్నాం. కేంద్రం దోచుకుంటుందని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే ధరలు పెంచినట్లు చెబుతున్నారు. కరోనా లేని సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచింది. అని పేర్కొన్నారు.