‘ఆర్ఆర్ఆర్’ డైలాగ్ లీక్ చేసిన జక్కన్న

తన సినిమాలకు సంబంధించి తనకు తానుగా ఏ విశేషాలూ బయట పెట్టడానికి ఇష్టపడడు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే చిత్ర బృందంలోని వాళ్లు కూడా ప్రమోషన్లలో సినిమా సీక్రెట్స్ ఏవీ బయటపెట్టకుండా చూసుకుంటాడు. ‘బాహుబలి’కి సంబంధించి ఓ వేడుకలో ప్రభాస్ ఏదో చెప్పబోతుంటే.. రాజమౌళి కింది నుంచి ‘నో’ అన్నట్లుగా హెచ్చరిక జారీ చేయడం తెలిసిందే. ఆ మధ్య తన తండ్రి ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ పాత్ర గురించి మీడియాతో మాట్లాడితే.. జక్కన్న నొచ్చుకున్నట్లుగా వార్తలు రావడం తెలిసిందే.

అలాంటి రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఒక ముఖ్యమైన డైలాగ్‌ను ఒక ప్రైవేటు కార్యక్రమంలో తనంతట తానే బయటపెట్టేయడం విశేషం. ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం”.. ఇదీ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ కీలక సన్నివేశంలో వచ్చే డైలాగ్. ఈ మాటను బట్టి సినిమాలో ఒక భారీ యుద్ధం ఉంటుందని.. హీరోలిద్దరూ ధర్మయుద్ధం చేయడం ద్వారా అందులో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌లో ఛాయిస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజమౌళి ఈ డైలాగ్‌ను పంచుకోవడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’కు ఫేమస్ రైటర్ సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. “నిర్మాత శోభు యార్లగడ్డ ద్వారా ఛాయిస్‌ ఫౌండేషన్‌ సతీశ్‌ పరిచయం అయ్యారు. పిల్లల్లో కలిగే 90శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయి. ఛాయిస్‌ ఫౌండేషన్‌ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతోంది” అని అన్నాడు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’లోని డైలాగ్‌ను పంచుకుని అందరినీ అలరించారు. చిన్నారుల కోసం పనిచేస్తున్న ఈ సంస్థకు 2 కోట్ల రూపాయల చెక్‌ను మాస్ మ్యుచవల్ ఫండ్ తరపున రవి తంగిరాల అందించారు.