అందాల రాశి.. అక్కడ ఇంకొకటి

బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టి, టాలీవుడ్‌లో వరుస హిట్లు కొట్టి.. ఇప్పుడు కోలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయింది రాశీఖన్నా. తెలుగులో నాగచైతన్యతో ‘థాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ చిత్రాలు చేస్తోంది. అయితే ఆమె దృష్టి తమిళ ఇండస్ట్రీపైనే ఎక్కువ ఉందేమో అనిపిస్తోంది.

ఒకప్పుడు రాశి తెలుగులో బిజీ హీరోయిన్. నయనతార లీడ్ రోల్ చేసిన ‘అంజలి సీబీఐ’ మూవీలో కీలక పాత్రతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చంది. ఆ తర్వాత అక్కడ వరుసగా అవకాశాలు రావడంతో బిజీ అయ్యింది. అలా అని తెలుగును వదిలేయలేదు. ప్రతిరోజు పండగే, వెంకీమామ, వరల్డ్ ఫేమస్ లవర్‌‌ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించింది. కానీ తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలున్నాయి. రీసెంట్‌గా ‘చంద్రకళ’ రెండో సీక్వెల్ ‘ఆరణ్మనై 3’ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో ఆ చిత్రాన్ని తీసిన దర్శకుడు సి.సుందర్ తన నెక్స్ట్ సినిమాలోనూ రాశినే హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఓ కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌ అని తెలుస్తోంది. జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానుంది.

మరోవైపు వెబ్ సిరీసుల పైన కూడా దృష్టి పెట్టింది రాశీఖన్నా. అది కూడా రెండు బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో రాజ్‌, డీకేలు తీస్తున్న ‘ఫేక్స్‌’ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. మరోవైపు అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘రుద్ర’ సిరీస్‌లోనూ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది.