అందుకే ఆర్టీసీ రేట్లు ఇప్పుడే పెంచ‌లేదా?

తెలంగాణ‌లో ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచేందుకు కొంత‌కాలంగా ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆర్టీసీ న‌ష్టాల్లో ఉంద‌ని దాన్ని గ‌ట్టెక్కించాలంటే ధ‌ర‌లు పెంచ‌క త‌ప్ప‌ద‌ని ర‌వాణా మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, ఎండీ స‌జ్జ‌నార్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వించారు. ధ‌ర‌ల పెంపు ప్ర‌తిపాద‌న‌ను సీఎం కేసీఆర్‌కు అందించారు. దీంతో ఆదివారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆర్టీసీ టికెట్ రేట్ల పెంపుపై కేసీఆర్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం.. రాష్ట్రంలోని ఆ పార్టీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మైన కేసీఆర్‌.. టికెట్ ధ‌ర‌ల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో ఆయ‌న నిర్ణ‌యం వెన‌క ఏదో ప్ర‌ణాళిక దాగి ఉంటుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆర్టీసీ టికెట్ రేట్ల‌ను ప్ర‌భుత్వం పెంచ‌డం ఖాయ‌మే కానీ ఆ నిర్ణ‌యాన్ని మాత్రం వాయిదా వేసింది. అలా ఎందుకు చేసిందంటే.. ఈ నెల 29న టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జ‌న స‌భ నిర్వ‌హించ‌నుంది. టికెట్ల రేట్ల‌ను పెంచితే ఆ స‌భ‌కు ముందు ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌ని భావించే కేసీఆర్ ఆ నిర్ణ‌యాన్ని వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా హ‌నుమ‌కొండ జిల్లాలో ఈ నెల 29న భారీ స్థాయిలో బ‌హ‌రింగ స‌భ నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. అందు కోసం 10 ల‌క్ష‌ల మందిని త‌ర‌లించాల‌ని చూస్తోంది. ఆ స‌భ కోసం స్థ‌లం సేక‌ర‌ణ విష‌యంలో ఇప్ప‌టికే స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. స‌భ కోసం త‌మ పంట భూముల‌ను ఇవ్వ‌మ‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు టీఆర్ఎస్ నేత‌లు అధికారులు మాత్ర‌మే స‌భ కోసం ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచితే ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని అది బ‌హ‌రంగ స‌భ‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని కేసీఆర్ అనుకుంటున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల రాజేంద‌ర్ చేతిలో ఓట‌మితో టీఆర్ఎస్‌కు దెబ్బ త‌గిలింది.

ఇక వరి కొనుగోళ్లలో జ‌రుగుతున్న జాప్యంతో ప్ర‌భుత్వంపై రైతుల్లో విశ్వాసం త‌గ్గుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో టికెట్ రేట్ల‌ను పెంచితే సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ పార్టీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో ఆ నిర్ణయాన్ని స‌భ జ‌రిగేంత వ‌ర‌కూ వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. ఎలాగో ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు సీఎం ద‌గ్గ‌రికి చేరాయి కాబ‌ట్టి రేట్లు పెంచ‌డం ఖాయం. కానీ ఆ బాదుడు కాస్త ఆల‌స్యంగా ప్ర‌జ‌ల‌పై ప‌డ‌నుంది.