ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన బీజేపీ

వైసీపీ ప్రభుత్వ పాలనపై బీజేపీ నిప్పులు చెరిగింది. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై నాయ‌కులు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఏపీకి చెందిన ముఖ్య బీజేపీ నేత‌.. సత్య కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అసమర్థత ప్రజలకు శాపంగా మారిందన్నారు. జగన్ వచ్చాక రాజధానిపై స్పష్టత లేదన్న ఆయన.. పెట్టుబడుల జాడ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అస‌లు ప్ర‌భుత్వం ఉందా? అనే సందేహాలు కూడా వ్యక్త‌మ‌వుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఈ సంద‌ర్భంగా స‌త్య‌కుమార్ చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో మిత్రుడు ఏపీ గురించి అడిగారు. ఏపీలో పెట్రో పన్ను ఎందుకు తగ్గించలేదని అడిగారు. ఏపీ సీఎం జగన్‌ గురించి ఆయనకు 4 ముక్కల్లో చెప్పా. “సీఎం గారి తప్పులు.. రాష్ట్ర ఖజానా అంతా అప్పులు. మంత్రులవి అబద్ధపు గొప్పలు.. జనాలకేమో తిప్పలు” అంటూ బదులిచ్చానంటూ సత్య కుమార్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అంతేకాదు.. స‌త్య కుమార్ అక్క‌డితో ఆగిపోలేదు. వైసీపీ నేతలు రాష్ట్రం దాటి వచ్చి దేశంలో రోడ్లు చూడాలి. దేశంలో ఎక్కడా వర్షం పడలేదా..? రోడ్ల మరమ్మతు జరగలేదా..? వైసీపీ అసమర్థత ప్రజలకు శాపంగా మారింది. జగన్ వచ్చాక రాజధానిపై స్పష్టత లేదు.. పెట్టుబడుల జాడ లేదు. మీకు పాలన చేతకాక కేంద్రం మీద పడి ఏడుస్తున్నారా..? రాజధాని కోసం భూములిచ్చిన రైతులను తరిమేశారు. రాజధానికి గత ప్రభుత్వం వేసిన 4 శాతం వ్యాట్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆ నిధులు వాడేది.. అమరావతి నిర్మాణానికా.. కూల్చేందుకా? అని నిల‌దీశారు.

అంటే.. రాజ‌ధాని నిర్మాణం కోసం.. గ‌త చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాన్ని ఒక సామాజి వ‌ర్గానికి అంట‌గ‌ట్టిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. అదే చంద్ర‌బాబు అమ‌రావ‌తి అభివృద్ధి కోసం.. విధించిన 4శాతం వ్యాట్‌ను మాత్రం కొన‌సాగించి.. ఆదాయం పొందుతున్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. సో.. మొత్తానికి చాన్నాళ్ల‌కు.. బీజేపీ నేత‌లు.. ఏపీ స‌ర్కారును టార్గెట్ చేశార‌న్న మాట‌. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.