తండ్రి బ‌స్సు.. త‌న‌యుడు సైకిల్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో జ‌గన్ చేతిలో చావుదెబ్బ తిన్న టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌లు చావోరేవో లాంటివి. 2024 ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పార్టీకి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌నేది నిపుణుల మాట‌. కానీ జ‌గ‌న్ ధాటిని త‌ట్టుకుని విజ‌యం సాధించ‌డ‌మంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అందుకే ఆ ఎన్నిక‌ల్లోపు పార్టీని బ‌లోపేతం చేసి తిరిగి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందే దిశ‌గా తండ్రీకొడుకులు అడుగులు వేయ‌నున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ఒక‌రు బ‌స్సు యాత్ర‌తో మ‌రొక‌రు సైకిల్ యాత్ర‌తో జ‌నాలను ఆక‌ట్టుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించే బృహ‌త్త‌ర బాధ్య‌త‌ను చంద్ర‌బాబు భుజాల‌కెత్తుకున్నారు. ఇప్ప‌టికే ఆ దిశగా క‌స‌ర‌త్తులు మొద‌లెట్టారు. నియోజ‌కవ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేస్తూ.. అక్క‌డి ప‌రిస్థితుల‌పై ఓ అంచ‌నాకు వ‌స్తున్నారు. ఆ మేర‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జీల‌ను నియ‌మిస్తూ సాగుతున్నారు.

ఆయ‌న పార్టీ కోసం ఇలా నానా తంటాలు ప‌డుతుంటే పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల్లో కొంత‌మంది మాత్రం ఏమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఉంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో బాధ్య‌త‌నంతా తీసుకున్న బాబు బ‌స్సు యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. అధికార జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు యాత్ర చేస్తాన‌ని బాబు గతంలోనే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌య‌సులో ఆయ‌న పాద‌యాత్ర చేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించే బ‌స్సు యాత్ర‌కు మొగ్గు చూపుతున్నార‌నే టాక్ ఉంది.

మ‌రోవైపు రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న కెరీర్‌కు వేగం అందించ‌డంతో పాటు టీడీపీ విజ‌యం కోసం కృషి చేస్తాన‌నే అభిప్రాయం క‌లిగించేందుకు చిన‌బాబు లోకేష్ సైకిల్ యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ఓ నాయ‌కుడిగా త‌న సామ‌ర్థ్యంపై ఉన్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేసుకునేందుకు ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నున్నారు.

వ‌చ్చే ఏడాది ఆరంభలో ఆ యాత్ర ఉండే అవ‌కాశాలున్నాయి. వీలైన‌న్ని ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాలు చుట్టేసేలా ఈ యాత్ర రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌లోని ఇచ్ఛాపురం నుంచి మొద‌ల‌య్యే ఈ యాత్ర రోజుకు 30 కిలోమీట‌ర్ల మేర సాగి చివ‌రకు క‌డ‌ప జిల్లాలో ముగిసేలా ఈ మ్యాప్‌ను రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం.

పార్టీలో మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు జ‌నాల్లో ఆద‌ర‌ణ పొందేందుకు లోకేష్‌కు ఆ యాత్ర ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిస్తే ఆ విజ‌యంలో త‌న పాత్ర కూడా ఉందంటూ.. ఈ సైకిల్ యాత్ర గురించి లోకేశ్ గొప్ప‌గా చెప్పే అవ‌కాశ‌ముంది.