సోమిరెడ్డిని సైడ్ చేసినట్లేనా ?

సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సైడ్ చేసినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్చార్జిగా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును చంద్రబాబునాయుడు నియమించారు. జిల్లాలో ఎంతోమంది సీనియర్లుండగా, సోమిరెడ్డి యాక్టివ్ గానే ఉన్నప్పటికీ ప్రత్యేకించి అచ్చెన్నను ఇన్చార్జిగా నియమించాల్సిన అవసరం ఏమిటి ?

నిజానికి అచ్చెన్న నెల్లూరు జిల్లాలో చేయగలిగింది కూడా ఏమీలేదు. స్ధానిక నేతలు సోమిరెడ్డి, బీద రవిచంద్రయాదవ్ లాంటి అనేకమంది సీనియర్లున్నారు. వీరంతా పార్టీ అధికారంలో ఉన్నపుడు అపరిమితమైన అధికారాలను అనుభవించినవారే. అలాంటిది ఇపుడు హఠాత్తుగా అచ్చెన్నను ఎందుకు నియమించారంటే నెల్లూరు కార్పొరేషన్ను గెలిచి తీరాలన్న పట్టుదల వల్లే అని చెప్పవచ్చు. పట్టుదలుంటే ఎన్నికలో గెలవటం సాధ్యం కాదు. అందుకు తగ్గ వ్యూహాలను అమలు చేయాలి.

ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతును కూడగట్టుకున్నపుడు మాత్రమే గెలుపు అవకాశాలుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే జిల్లాలోని పదికి పది అసెంబ్లీ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. నెల్లూరు ఎంపీ సీటును కూడా అధికారపార్టీయే గెలిచింది. అప్పటినుండి జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా వైసీపీదే ఆధిపత్యం. పంచాయితీలు, పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా దాదాపు స్వీప్ చేసినట్లే. ఈ ఎన్నికల్లో మొత్తం సోమిరెడ్డే బాధ్యతలు తీసుకున్నారు.

అయితే ఏ ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి ప్రభావం కనబడలేదు. దాంతో సోమిరెడ్డి నాయకత్వం మీద చంద్రబాబుకు నమ్మకం పోయినట్లుంది. అందుకనే ప్రత్యేకించి అచ్చెన్నాయుడును నెల్లూరు ఎన్నికకు ఇన్చార్జిగా నియమించారు. మరి అచ్చెన్న ఏమి చేయగలరు ? అచ్చెన్నను ఇన్చార్జిగా నియమించినంత మాత్రాన టీడీపీ తలరాత మారిపోతుందా ? ఏమో చెప్పలేము. ముందు తమ్ముళ్ళల్లో ఐకమత్యం సాధించాలి.

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చాలా జిల్లాల్లో తమ్ముళ్ళల్లో ఆధిపత్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. ముందు ఆ గొడవలన్నింటినీ సర్దుబాటు చేసి ఏకతాటిపైకి తేవాలి. ఇక నెల్లూరు జిల్లా నేతలు ఏ మేరకు అచ్చెన్న మాటను ఏమి వింటారు ? ఈ పరిస్దితుల్లో నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.