సజ్జన్నార్ సీన్ లో ఉంటే ఇలాంటివే జరుగుతాయి

అందరికి ఎదురయ్యే అనుభవమే. కానీ.. అక్కడున్నది సీనియర్ ఐపీఎస్ అధికారిక వీసీ సజ్జన్నార్. కీలక స్థానాల్లో ఉండే వారి స్పందన కిందిస్థాయిలో వచ్చే మార్పులకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరికి తరచూ ఎదురయ్యే అనుభవమే ఇది. టికెట్ తీసుకునే వేళ.. వంద రూపాయిలు.. రూ.200 నోట కానీ రూ.500 నోటు కానీ ఇస్తే.. చిల్లర లేదంటూ టికెట్ వెనుక ఇవ్వాల్సిన మొత్తాన్ని కండక్టర్ రాసివ్వటం తెలిసిందే. బస్సు దిగే వేళలో.. చిల్లర తీసుకోవాలన్న విషయం గుర్తుంటే ఫర్లేదు.. ఏదో ధ్యాసలో పడి మర్చిపోతే ఇంతే సంగతులు.

తాజాగా ఇలాంటి పరిస్థితే ఒక ప్రయాణికుడికి ఎదురైంది. ఎందుకులే అని వదిలేయకుండా సాంకేతికతతో ప్రయత్నించిన సదరు ప్రయాణికుడికి తనకు రావాల్సిన చిల్లర డబ్బులు వచ్చేశాయి. ఈ ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తాను మర్చిపోయిన డబ్బుల గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఆ వ్యక్తికి అందాల్సిన మొత్తాన్ని ఇచ్చేయటం గమనార్హం. ఇంతకూ అసలేం జరిగిందంటే..

సీతాఫల్ మండికి చెందిన లిక్కిరాజు బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కి రూ.100 నోటు ఇచ్చాడు. అయితే..చిల్లర లేని కారణంగా డబ్బులు తిరిగి ఇవ్వని కండక్టర్.. టికెట్ వెనుక రూ.80 ఇవ్వాల్సి ఉందంటూ రాసిచ్చాడు. తాను దిగాల్సిన చోటుకు దిగిన సదరు వ్యక్తి.. కండక్టర్ నుంచి తీసుకోవాల్సిన చిల్లర డబ్బుల్ని మర్చిపోయాడు. బస్సు వెళ్లిన వెంటనే తనకు రావాల్సిన డబ్బులు గుర్తుకు వచ్చింది. జేబులో రూపాయి కూడా లేని వేళ.. అలానే నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు.

అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కు ట్యాగ్ చేస్తూ తన బాదను వెళ్లబోసుకున్నాడు. తనకు రావాల్సిన రూ.80గురించి చెప్పాడు. దీంతో స్పందించిన సజ్జన్నార్.. జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డిని ఈ ఉదంతం గురించి చెక్ చేయాలని కోరారు. దీంతో.. స్పందించిన డిపో మేనేజర్.. విషయం గురించి ఆరా తీసి సదరు వ్యక్తికి అందాల్సిన రూ.80ను ఫోన్ పే ద్వారా పంపారు. సజ్జన్నార్ స్పందించటం.. ఆ వెంటనే ఆర్టీసీ డిపో మేనేజర్ రియాక్టు అయి.. ప్రయాణికుడికి అందాల్సిన మొత్తాన్ని వెంటనే అందజేసిన వైనంపై హర్షం వ్యక్తమవుతోంది. కీలక స్థానాల్లో ఉండే అధికారులు సరైన రీతిలో స్పందించాలే కానీ.. ఫలితం ఇలానే ఉంటుందన్న మాట వినిపిస్తోంది.