‘భీమ్లానాయక్’కి బెస్ట్ డేట్

మొత్తానికి సంక్రాంతి రేసు నుంచి మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ తప్పుకుంది. ఇది ఎప్పట్నుంచో అనుకుంటున్నదే. ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేశారు. ఇంతకుముందు ‘బాహులబి’ సినిమా కోసమని మహేష్ తన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు. అప్పుడా నిర్ణయం ప్రశంసలందుకుంది. ‘బాహుబలి’ తెలుగు సినిమా గర్వించదగ్గన చిత్రం అవుతుందని అర్థం చేసుకుని.. ఇగోకు పోకుండా దానికి దారిచ్చి నెల రోజులు లేటుగా మహేష్ తన సినిమాను షెడ్యూల్ చేసుకున్నాడు. ఫలితంగా ‘బాహుబలి’ గొప్పగా ఆడింది. ‘శ్రీమంతుడు’కు కూడా మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు కూడా మహేష్ ఇదే రీతిలో ఆలోచించి ‘సర్కారు వారి పాట’ను ఏప్రిల్ 1కి వాయిదా వేసుకున్నాడు. ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా మూవీ కాబట్టి దాన్ని వాయిదా వేయలేరు. అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’కు, దానికి వారం రోజుల గ్యాప్ కూడా ఉంది.

ఐతే సంక్రాంతి రేసులో నిలిచిన మరో చిత్రం ‘భీమ్లా నాయక్’ సంగతే తేలాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చినా తగ్గేదే లే అన్నట్లుగా సంక్రాంతి రిలీజ్ గురించే మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణిస్తున్నారు. కానీ ఈ మధ్యే రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ కొత్త ప్రోమో చూశాక దాంతోె పోటీ పడటం అంత మంచిది కాదని.. వసూళ్లపై కచ్చితంగా ప్రభావం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘భీమ్లా నాయక్’ నిర్మాతల్లో కూడా ఈ భయం ఉందని.. పవన్ కళ్యాణ్‌కు ఈ విషయంలో సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలొస్తున్నాయి. సంక్రాంతిని వదిలేసి.. మరీ లేటు చేయకుండా రిపబ్లిక్ డే వీకెండ్లో వస్తే ‘భీమ్లా నాయక్’కు అన్ని రకాలుగా మంచిదన్న అభిప్రాయం చిత్ర బృందంలో ఉందట. వేసవి వరకు సినిమాను ఆపలేమని.. పైగా సమ్మర్ సీజన్లోనూ విపరీతమైన పోటీ ఉందని.. సంక్రాంతి హడావుడి తగ్గాక రిపబ్లిక్ డే వీకెండ్లో సినిమాను వదిలితే.. సోలోగా బాక్సాఫీస్‌ను దున్నుకోవచ్చని.. ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ వచ్చే వరకు మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారట. బహుశా ఈ డేట్‌కే ‘భీమ్లా నాయక్’ ఖరారయ్యే అవకాశాలున్నాయి.