ఉప ఎన్నికల దెబ్బేనా ?

దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల దెబ్బ నరంద్ర మోడిపై బాగానే పనిచేసినట్లుంది. పెట్రోలుపై లీటరుకు రు. 5, డీజిల్ పై లీటరుకు రు. 10 తగ్గించటమంటే మామూలు విషయం కాదు. నిజానికి తగ్గించింది చాలా తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ఈ తగ్గింపు కూడా తగ్గించటానికి నరేంద్ర మోడి ఏమాత్రం ఇష్టపడలేదు. దేశవ్యాప్తంగా జరిగిన 29 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 22 నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అలాగే 3 పార్లమెంటు సీట్లలో రెండు చోట్ల ఓడిపోయింది.

కమలం పార్టీ ఓడిపోయిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ సిట్టింగ్ సీట్లు కూడా ఉన్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పటికీ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓడిపోయింది. ఇదే సమయంలో వచ్చే మార్చిలోగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా జనాల్లో మోడి పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోందన్నది వాస్తవం. గడచిన ఏడాది నుండి పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించమని జనాలు ఎంత మొత్తుకున్నా మోడీ ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఉపఎన్నికల ఫలితాల్లో ఓడిపోయిన వెంటనే పెట్రోల్, డీజల్ ధరలను కేంద్రం తగ్గించిందంటేనే ఉపఎన్నికల దెబ్బ ఏ స్ధాయిలో పడిందో అర్ధమవుతోంది. పైగా తగ్గించిన ధరలు దీపావళి కానుకంటు ఊదరగొడుతోంది. దీపావళి పండగకన్నా ముందు చాలా పండగలు వచ్చినా మోడీ ఆ పండగలను ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రం తాజా నిర్ణయం వల్ల పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీ రు. 27.90కి తగ్గింది. అలాగే డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ రు. 21.80కి తగ్గింది.

ఇంధనాల మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గడం వల్ల నెలకు రు. 8700 కోట్లు, ఏడాదికి సుమారు లక్ష కోట్ల రూపాయల ఆదాయం తగ్గినట్లయ్యింది. మరి కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గిస్తే పెట్రోల్, డీజల్ ధరలు ఇంకా తగ్గుతాయనటంలో సందేహంలేదు. కేంద్రం నిర్ణయం వెలుగుచూడగానే త్రిపుర, గోవా, కర్ణాటక, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని వ్యాట్ ను కాస్త తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయి కాబట్టి మిగిలిన రాష్ట్రాలు కూడా తగ్గించే అవకాశం ఉంది.

మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ధరలు పెంచటమే కానీ తగ్గించటమంటు లేదు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ లీటరు ధరలు సెంచరీ దాటేశాయి. ఇంధనాల ధరలు తగ్గించిన కారణంగా రైతులుకు, మామూలు జనాలకు బాగా ప్రయోజనముంటుంది. ఎలాగంటే ఇంధనం ధరలు తగ్గించడం వల్ల వస్తురవాణా తదితరాల ఖర్చులన్నీ తగ్గుతాయి. దీనివల్ల అంతిమంగా ప్రజలకు ఉపయోగమే అని అందరికీ తెలిసిందే. కాకపోతే అంతర్జాతీయంగా పెట్రోల్, డీజల్ బ్యారెల్ ధరలతో పోల్చితే మనదేశంలోని ధరలు చాలా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి.