పునీత్ కోసం బెంగళూరులో చరణ్..

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్లో చాలామంది సినీ ప్రముఖులకు బాగా క్లోజ్. కన్నడ సినీ చరిత్రలోనే అతి పెద్ద కథానాయకుడైన రాజ్ కుమార్ తనయుడు కావడం, పైగా పెద్ద హీరో కావడం, మంచి వ్యక్తిగా పేరుండటంతో పునీత్‌తో టాలీవుడ్ ప్రముఖులు చాలామందికి ముందు నుంచి మంచి సంబంధాలున్నాయి. ఈ అనుబంధంతోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్.. ఇంకా పలువురు పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరుకు వెళ్లారు. ఐతే ఆ టైంలో పుణెలో శంకర్‌తో చేస్తున్న సినిమా షెడ్యూల్లో బిజీగా ఉండటం, షూటింగ్ క్యాన్సిల్ చేసే అవకాశం లేకపోవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరుతో పాటుగా పునీత్ పార్థివ దేహ సందర్శనకు వెళ్లలేకపోయాడు. ఐతే ఇప్పుడు షెడ్యూల్ ముగియడంతో పుణె నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ కుటుంబ సభ్యులను చరణ్ పరామర్శించాడు.

చరణ్.. పునీత్ చిత్ర పఠం ముందు నివాళి అర్పిస్తున్న, శివరాజ్ కుమార్ పక్కన కూర్చుని ఓదారుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం చరణ్ మీడియాతో మాట్లాడాడు. పునీత్‌తో తన అనుబంధం గురించి గుర్తు చేసుకున్నాడు. పునీత్ చనిపోవడంతో తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లే ఉందని.. ఇలా ఎవరికైనా జరగొచ్చని, కానీ పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చరణ్ అన్నాడు. పునీత్ ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి అని.. అందరితో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తాడని చెప్పాడు. పునీత్ తన ఇంటికి కూడా వచ్చాడని.. అప్పుడు అతడి ముందు తాము అతిథులం అయ్యామని.. అంతగా అందరినీ ఓన్ చేసుకుంటాడని .. ఒక మనిషి ఎలా ప్రవర్తించాలనడానికి పునీత్ ఉదాహరణ అని.. అతనంటే తనకెంతో ఇష్టమని, తనను చాలా మిస్ అవుతున్నానని చరణ్ అన్నాడు.