మోడీ పేరు ఒక్క‌టే చాల‌దు.. మారుతున్న బీజేపీ వ్యూహం!

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితంతో బీజేపీకి స‌రికొత్త ఉత్సాహం వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. అధికార టీఆర్ఎస్‌ను సీఎం కేసీఆర్‌ను ఎదిరించిన ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యం సొంతం చేసుకున్నారు. వ్య‌క్తిగ‌తంగా అక్క‌డి ప్ర‌జ‌ల‌తో త‌న‌కున్న అనుబంధం కార‌ణంగా ఈట‌ల మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలిచార‌ని కానీ ఇప్పుడా ఘ‌న‌త క‌చ్చితంగా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీకి ఆ దిశ‌గా ఈ విజ‌యం మాంచి కిక్కునందించింద‌ని చెబుతున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం పోరాడుతున్న బీజేపీ తెలంగాణ‌లో వ్యూహం మారుస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

బీజేపీ అంటే మోడీనే.. దేశంలోని ఏ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన ఆ పార్టీ ఇదే నినాదంతో ముందుకు సాగుతోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించిన మోడీ తొలిసారి ప్ర‌ధానిగా చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు.. అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు దేశం కోసం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన స్థానిక నాయ‌కులు ఓట్లు రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక 2019లోనూ రెండోసారి ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత కూడా రాష్ట్రాల్లో ఆ పార్టీ నాయ‌కులు మోడీ ప్ర‌భనే ఆయుధంగా మ‌లుచుకున్నారు. కానీ ఇప్పుడా వ్యూహాన్ని మార్చే అవ‌స‌రం వ‌చ్చిన‌ట్లు సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో అయితే మోడీ పేరునే న‌మ్ముకుంటే లాభం లేద‌ని ఇక్క‌డి నేతల ఇమేజ్‌ను కూడా వాడుకోవాల‌ని పార్టీ భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

క‌రోనా క‌ట్ట‌డిలో వైఫ‌ల్యం.. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై మొండి వైఖ‌రి ఇలా వివిధ కార‌ణాల వ‌ల్ల మోడీ ప్ర‌భ క్ర‌మంగా త‌గ్గుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీ పేరును వాడుకుంటూనే మ‌రోవైపు స్థానిక నేతల ఇమేజ్‌ను కూడా ఉప‌యోగించుకోవాల‌ని బీజేపీ అనుకుంటున్నట్లు స‌మాచారం. ముఖ్యంగా తెలంగాణ రాజ‌కీయాల్లో అయితే పార్టీకి ఆ అవ‌స‌రం ఉంది. ఎందుకంటే మోడీ పేరుతో 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగిన బీజేపీ.. కేవ‌లం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్ర‌మే గెలుచుకుంది. ఆ త‌ర్వాత నాలుగు ఎంపీ సీట్లు సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ ఆ నాయ‌కులకు స్థానికంగా మంచి ప‌లుకుబ‌డి ఉంది. సొంత ఇమేజ్ వాళ్ల‌కు క‌లిసొచ్చింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. దీంతో టీఆర్ఎస్‌ను ఢీ కొట్టాలంటే కేవ‌లం మోడీ ఇమేజ్ మాత్ర‌మే స‌రిపోద‌ని బీజేపీకి స్ప‌ష్ట‌మైంది.

దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌రపున గెలిచిన ర‌ఘునంద‌న్ రావుకు పార్టీ పరంగా కంటే కూడా ఓ నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు అభిమానం ఎక్కువ‌గా ఉంది. అది క‌లిసొచ్చే ఆయ‌న విజ‌యం సాధించార‌నే అభిప్రాయాలు వినిపించాయి. ఇక హుజూరాబాద్‌లో అయితే ఈట‌ల రాజేంద‌ర్‌ను చూసే ఓట్లు వేశారు కానీ బీజేపీ అభ్య‌ర్థి అని మాత్రం కాద‌ని టాక్‌. దీంతో ఇక ప్ర‌జ‌ల‌ను మెప్పించే నాయ‌కుల కోసం బీజేపీ అన్వేష‌ణ సాగుతుంద‌ని అదే వ్యూహంతో ఆ పార్టీ ముందుకు వెళ్తుంద‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఈట‌ల లాంటి నాయ‌కుడు దొర‌క‌డం క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉన్న నాయ‌కులు ఉన్నారు. ఇక వీళ్ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డంపై బీజేపీ దృష్టి సారించ‌నున్నట్లుగా తెలుస్తోంది.