పునీత్ చివరి సినిమా తెలుగులోనూ..

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పాలై ఆరు రోజులు గడిచిపోయాయి. కన్నడ నాట అభిమానులు ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు. దీపావళి పండుగ సంబరాలు కూడా అక్కడ ఎప్పట్లా చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. రాజ్ కుమార్ కుటుంబంలో ఎవరికేం జరిగినా తమ కుటుంబంలో జరిగినట్లే ఫీలవుతారు అక్కడి కోట్లాదిమంది.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించిన పునీత్.. ఇలా హఠాత్తుగా మరణించడంతో ఆ బాధను తట్టుకోవడం కన్నడిగులకు సాధ్యం కావడం లేదు. రాజ్ కుమార్ 78 ఏళ్ల వయసులో చనిపోతేనే అభిమానులు తల్లడిల్లిపోయారు.

కొన్ని గుండెలు ఆగిపోయాయి. అలాంటిది పునీత్ 46 ఏళ్లకే మరణిస్తే వారి బాధ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పునీత్ మరణానంతరమే.. అతను ఎంత గొప్పగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడో వెల్లడి కావడంతో కన్నడిగులే కాక వేరే భాషల వాళ్లు కూడా అతడి గురించి ఎంతగానో బాధ పడుతున్నారు.

పునీత్ మరణించిన సమయంలో తెలుగు సినీ తారలే కాక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాన్య ప్రజలు కూడా చూపించిన ప్రేమాభిమానాలకు పునీత్ అభిమానులు కదిలిపోయారు. తెలుగు సినీ ప్రముఖులతో పునీత్‌కు ఇంత అనుబంధం ఉందా అన్న చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో తెలుగువాళ్లంతా కూడా గొప్పగా స్పందించారు.

ఈ నేపథ్యంలోనే పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ను తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ‘జేమ్స్’ సినిమాకు సంబంధించి పునీత్ టాకీ పార్ట్ అంతా పూర్తి చేశాడు. ఒకట్రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాల్సి ఉంది కానీ.. వాటిని పక్కన పెట్టేయనున్నారు.

సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మార్చి 17న పునీత్ పుట్టిన రోజు కానుకగా సినిమాను రిలీజ్ చేయాలన్నది ప్లాన్. దీన్ని బహు భాషల్లో విడుదల చేసేందుకు అవకాశాలున్నాయి కానీ.. తెలుగులో మాత్రం పెద్ద ఎత్తునే సినిమా విడుదల కానుంది. పునీత్ చనిపోయినపుడు తెలుగు వాళ్లు చూపించిన ప్రేమ ప్రకారం చూస్తే అతడి చివరి సినిమాకు కూడా ఇక్కడ మంచి స్పందన వచ్చే అవకాశముంది.