షర్మిల వ్యూహం వర్కవుటవుతుందా ?

పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల బాగా రెచ్చిపోతున్నారు. ఎవరిమీదయ్యా అంటే ఇంకెవరి మీద కేసీయార్ మీదే. రెండు పాయింట్ల మీద షర్మిల రెచ్చిపోతున్నారు. అందులో ఒకటి సమైక్య రాష్ట్రంపై జరుగుతున్న చర్చమీద. ఇక రెండోపాయింట్ ఏమిటంటే నిరుద్యోగ సమస్య మీద.

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఏపీలో కూడా తనను పార్టీపెట్టమని, గెలిపిస్తామని వేలాది విజ్ఞప్తులు వస్తున్నాయని కేసీయార్ చెప్పిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగేశారు.

రాజ్యవిస్తరణ ఆలోచనలో కేసీయార్ ఉన్నట్లు ఆరోపణలు మొదలుపెట్టేశారు. అంటే ఏదోరోజ ఏపీలో కూడా టీఆర్ఎస్ స్టార్ట్ చేస్తారని అప్పుడు మళ్ళీ తెలంగాణా+ఏపీ ఏకమైపోతాయన్న అర్ధం వచ్చేట్లుగా మాట్లాడారు రేవంత్. దీనిపై ఏపి మంత్రి పేర్ని నాని స్పందిస్తూ మళ్ళీ ఏపీలో ప్రత్యేకంగా పార్టీ ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని చేసిన వ్యాఖ్యలు ఆగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. తాజాగా పాదయాత్ర చేస్తున్న షర్మిల మాట్లాడుతూ ‘బలిదానాలతో తెలంగాణా సాధించుకున్నది మళ్ళీ ఏపీలో కలిపేయటానికా’ అని ప్రశ్నించారు.

అప్పటికేదో తాను కూడా ప్రత్యేక తెలంగాణా కోసం బాగా పోరాటాలు జరిపినట్లు షర్మిల బిల్డప్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్+టీఆర్ఎస్ పార్టీలు సెంటిమెంటును రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయంటు మండిపడ్డారు. తెలంగాణా-ఏపీని మళ్ళీ ఏకం చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. సరే షర్మిల ఎంతగా మాట్లాడినా తెలంగాణాలోని పార్టీలేవీ పట్టించుకునేంత సీన్ లేదులేండి.

ఇక నిరుద్యోగ సమస్య మీద మాట్లాడుతూ 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోచుకోకుండా పడున్నట్లు షర్మిల మండిపోయారు. ఉద్యోగాల భర్తీపై కేసీయార్ దృష్టి పెట్టకపోవటంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చెప్పారు. కొందరు నిరుద్యోగులు టీ, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నారంటు వాపోయారు. 5 లేకపోతే 6వ తరగతి చదివిన వారు ఎంఎల్ఏలు, మంత్రులుగా ఉన్నపుడు డిగ్రీ, పీజీలు చదివిన వారు టీ, టిఫిన్ సెంటర్లు పెట్టుకుని ఎందుకు బతకాలని కేసీయార్ ను నిలదీశారు.

ఎప్పటెప్పటి ఘటనలనో తీసుకుని కేసీయార్+కేటీయార్ మీద షర్మిల బాగా రెచ్చిపోయారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు తీసుకోకుండా కేసీయార్ గాడిదలు కాస్తున్నారా అంటు ఫుల్లుగా ఫైర్ అయిపోయారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీయార్ చేతిలో పెడితే ఇపుడు రు. 4 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినట్లంటు సూటిగా ప్రశ్నించారు. మొత్తంమీద కేసీయార్ ను డైరెక్టుగా ఎటాక్ చేస్తేకానీ జనాలు ఆదరించరని షర్మిల అనుకున్నట్లున్నారు. అందుకనే పాదయాత్రలో కేసీయార్ పై షర్మిల బాగా రెచ్చిపోతున్నారు. మరిది ఇంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.