వైసీపీ-టీడీపీ విషయంలో బీజేపీ వ్యూహమిదేనా ?

ఇటు క్షేత్రస్ధాయిలోను అటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లే అనిపిస్తోంది. ఇటు వైసీపీ అటు టీడీపీతో వ్యూహాత్మకంగా సమదూరం పాటించాలన్నదే కమలం పార్టీ వ్యూహంగా కనబడుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ దెబ్బ తిన్న దగ్గర నుండి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను బీజేపీ అగ్రనేతలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు సమాచారం.

గడచిన రెండున్నరేళ్ళుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు ఆయన పార్టీ నేతలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. పార్టీ నేతలు మాత్రమే జగన్ ప్రభుత్వంపై ఎంతగా బురద చల్లిస్తున్నారో అందరు చూస్తున్నదే. ఇది కాకుండా అనేకసార్లు జగన్ ప్రభుత్వంపై టీడీపీ అనేక ఫిర్యాదులు చేసింది. అలాగే వైసీపీ కూడా టీడీపీపై అనేక ఫిర్యాదులు చేసింది.

తాజాగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమని, డ్రగ్ స్టేట్ అని చంద్రబాబు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వాన్ని రద్దుచేయమని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా వైసీపీ ఎంపీలు టీడీపీ గుర్తును రద్దుచేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ సీఎంపై అనేక ఫిర్యాదులు చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండు పార్టీల్లో ఎవరు దేనిపైన ఫిర్యాదు చేసినా కేంద్ర హోంశాఖ అమిత్ షా వింటున్నారంతే.

చంద్రబాబుకు షా అపాయిట్మెంట్ ఇవ్వలేకపోయినా ఫోన్ లో మాట్లాడారు, తర్వాత టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఫిర్యాదును విన్నారు. అంటే ఏమర్ధం అవుతున్నదంటే రెండు పార్టీలతో బీజేపీ సమదూరం పాటించటం ద్వారా వైసీపీ-టీడీపీలు ఇంకా బాగా కొట్టుకోవాలని బీజేపీ ఆశిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే ఇపుడు ఏపీలో మూడో పార్టీకి అవకాశమే లేదు. పైగా ఇపుడు బీజేపీని జనాలెవరు పట్టించుకోవటంలేదు. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతింటే కానీ మూడో పార్టీ లేచేందుకు అవకాశం లేదు.

టీడీపీకి తెలంగాణాలో పరిస్ధితే ఏపీలో కూడా రాబోతోందనే సంకేతాలు కనబడతున్నట్లు కమలనాదులు భావిస్తున్నారు. జగన్ చేతిలో టీడీపీ నేలకరవాలని బీజేపీ కోరుకుంటోంది. ఇక భవిష్యత్తులో టీడీపీ లేవదని నిర్ధారణ అయిన తర్వాత ఆ స్ధానాన్ని తాము భర్తీ చేయాలని బీజేపీ ఆశపడుతోంది. అందుకనే చంద్రబాబును దగ్గరకు తీసుకుని మళ్ళీ నిలబెట్టేందుకు ఇష్టపడటంలేదు. మరి బీజేపీ సమదూరం వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే.