క్యాష్ చేసుకోవడంలో రవితేజ తర్వాతే..

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అనే మాట సినీ పరిశ్రమలో చాలా వరకు హీరోయిన్లకే వర్తిస్తుంటుంది. వాళ్ల కెరీర్ స్పాన్ తక్కువ కాబట్టి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి, పారితోషకాల విషయంలో రాజీ పడకుండా డిమాండ్‌కు తగ్గట్లు పుచ్చుకుని సాధ్యమైనంతగా సంపాదించడానికి చూస్తుంటారు. ఈ విషయంలో కొందరు హీరోలు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు.

టాలీవుడ్ విషయానికొస్తే.. క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో రవితేజను మించిన వారు లేరనే పేరుంది. కెరీర్లో తొలి పదేళ్లలో చాలా వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, నటుడిగా చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకున్న రవితేజ.. కొంచెం లేటుగా హీరోగా నిలదొక్కుకున్నాడు. స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాక అతను అసలిక ఆగలేదు. తన రేంజ్ హీరోలతో పోలిస్తే శరవేగంగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. పారితోషకాల విషయంలో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటాడని.. ఒక సినిమా హిట్టవగానే రేటు పెంచేస్తాడని.. అస్సలు రాజీ పడడని రవితేజకు పేరుంది. ఈ విషయంలో మాస్ రాజా కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. అయినా కూడా అతను తగ్గదేలే అన్నట్లుగా వెళ్లిపోతుంటాడు. మధ్యలో కొన్నేళ్లు సరైన విజయం లేక అతడి క్రేజ్ తగ్గింది. అందుకు తగ్గట్లే మార్కెట్, పారితోషకాలు కూడా పడిపోయాయి.

ఐతే ఈ ఏడాది ‘క్రాక్’తో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మాస్ రాజా. ఇక అంతే.. ఉన్నట్లుండి స్పీడు పెంచేశాడు. దాంతో పాటే పారితోషకం కూడా పెరిగిపోయింది. మళ్లీ తిరిగొచ్చిన తన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి గట్టి ప్రణాళికలతోనే సాగిపోతున్నాడు.

‘క్రాక్’ తర్వాత ఇప్పటికే ‘ఖిలాడి’, ‘రామారావు’ చిత్రాలను చివరి దశకు తీసుకెళ్లిన రవితేజ.. త్రినాథరావు నక్కిన సినిమాను గత నెలలోనే పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అవి చాలవన్నట్లు మొన్ననే సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అది రవితేజ 70వ సినిమా కాగా.. మంగళవారం రవితేజ 71వ చిత్రం గురించి హింట్ ఇచ్చారు. బుధవారం ఈ సినిమా గురించి ప్రకటన ఉంటుందట. మాస్ రాజా చేయబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. దర్శకుడెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.