రాక్ష‌సావ‌తారంలో ర‌వితేజ‌

మాస్ రాజా ర‌వితేజ మ‌ధ్య‌లో వ‌రుస ఫ్లాపుల‌తో బాగా ఇబ్బంది ప‌డ్డాడు. గ‌త ఏడాది డిస్కో రాజా టైంకి అయితే ర‌వితేజ మార్కెట్ కూడా బాగా దెబ్బ తినేసింది. ఐతే క్రాక్ మూవీతో అత‌ను భ‌లేగా పుంజుకున్నాడు. ఆ సినిమా క‌రోనా టైంలో, 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీలో రిలీజై అనూహ్య‌మైన వ‌సూళ్లు సాధించింది.

మాస్ రాజా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఊపులో ర‌వితేజ వ‌రుస‌బెట్టి సినిమాలు లాగించేస్తున్నాడు. ఆల్రెడీ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల‌ను చివ‌రి ద‌శ‌కు తీసుకెళ్లిన మాస్ రాజా.. ఇటీవ‌లే త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే తాజాగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు.

అభిషేక్ నామా నిర్మాణంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌తో అమితాస‌క్తిని రేకెత్తించింది. హీరోస్ డ‌సెంట్ ఎగ్జిస్ట్ అనే క్యాప్ష‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీని వెనుక ఉద్దేశం ఏంటా అని అంతా చ‌ర్చించుకుంటున్నారు. ఐతే ఇందులో హీరో క్యారెక్ట‌ర్ నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుంద‌ని.. జైలవ‌కుశ‌లో జై పాత్ర త‌ర‌హాలో ఉండే క్యారెక్ట‌ర్ ఇద‌ని.. అందుకే ఈ క్యాప్ష‌న్ పెట్టార‌ని స‌మాచారం.

అంతే కాక ఈ సినిమాకు రావ‌ణాసుర అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇలాంటి నెగెటివ్ టైటిల్‌తో, రాక్ష‌సుడి పేరుతో సినిమా రావ‌డం అరుదే. ఇంత‌క‌ముందు రావ‌ణ పేరుతో మోహ‌న్ బాబు ఓ సినిమా చేయాల‌నుకున్నారు కానీ.. అది సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు ఆ టైటిల్‌ను పొడిగించి మాస్ రాజా వాడుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.