బ‌ద్వేల్ ఓటింగ్ త‌గ్గింది.. 20 ఏళ్ల‌లో ఫ‌స్ట్ టైం..

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా.. క‌డ‌ప‌లోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్‌కు తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక అధికార పార్టీలో గుబులు రేపుతోంది. “ఎవ‌రూ పోటీలేరు. పైగా.. ఉన్న బీజేపీ కూడా యాక్టివ్ కావ‌డం టైం పడుతుంది. సో.. భారీ మెజారిటీ మాదే” అని వైసీపీ నాయ‌కులు ప్ర‌చారంలో ఊద‌ర‌గొట్టారు. అంతేకాదు.. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాలు.. ఇంటికే చేరుతున్నాయని.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న అని చెప్ప‌డం కాకుండా.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న‌ను అందిస్తున్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని.. ప్ర‌తి నెలా 1వ తారీకు సూరీడు కూడా క‌న్ను తెర‌వ‌కముందే అవ్వా తాత‌ల‌కు, దివ్యాంగుల‌కు పింఛ‌న్లు ఇస్తున్నామ‌ని.. సో.. ఈ ద‌ఫా బ‌ద్వేల్‌లో భారీ ఎత్తున పోలింగ్ జ‌రుగుతుంద‌ని.. అది కూడా త‌మ‌కు అనుకూలంగానే ఉంటుంద‌ని .. ఇక్క‌డ ప్ర‌చారం చేసిన మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. భారీ ఎత్తున మైకుల‌ను ప‌గ‌ల‌గొట్టారు.

క‌ట్ చేస్తే.. బద్వేల్ లో పోలింగ్ శాతం 68.12గా న‌మోదైంది. నిజానికి గత సాధారణ ఎన్నికల కంటే ఇది తక్కువ. గ‌తంలో 76.56 శాతంగా న‌మోదైన ఈ పోలింగ్‌.. ఇప్పుడు భారీ ఎత్తున త‌గ్గిపోయింది. అంతేకాదు.. గ‌డిచిన 20 ఏళ్లలో ఇదే తక్కువ శాతం పోలింగ్ అని గణాంకాలు చెబుతున్నాయి. సహజంగా ఉప ఎన్నికలంటే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్ర‌బుత్వం చ‌మ‌టోడ్చి.. అప్పులు చేసి.. మ‌రీ అమ‌లు చేస్తున్న పథకాలు అందుకున్న లబ్ధిదారులంతా పోలింగ్ బూతుల ముందు పోటెత్తుతారని ఆశించింది. ఇక‌, ఓ మంత్రి అయితే.. ఈవీఎంలు ప‌గిలిపోతే.. అది త‌మ బాధ్య‌త కాద‌ని.. చెప్పుకొచ్చారు. అంటే ఆ రేంజ్‌లో ఇక్క‌డ పోలింగ్ న‌మోద‌వుతుంద‌ని చెప్పుకొచ్చారు.

కానీ అదేమీ జరగలేదు. సామాన్య జనానికి ఓట్ల సంబరం పట్టలేదు. అంటే పోల్ మేనేజ్ మెంట్ సరిగా జరగలేదు. నిజానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలో లేకపోవడంతో వైసీపీకి భారీ ఎత్తున పోలింగ్ జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ప‌ట్టించుకోలేద‌నే వాద‌న ఇప్పుడు పార్టీలో వినిపిస్తోంది. అంతేకాదు.. జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. పక్క జిల్లాల నుంచి నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారే కానీ.. పోలింగ్ రోజు మాత్రం అంతా స్తబ్దుగా ఉన్నారు. దీనికితోడు జగన్ బహిరంగ సభ కూడా లేకపోవడంతో జనానికి పెద్దగా కిక్ ఎక్కలేదు.

డబ్బులు, మద్యం పంపిణీ లేదు. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కూడా వైసీపీ ఇదే స్ట్రాటజీ అలవాటు చేసింది. మద్యం, డబ్బులు పంచేది లేదని తెగేసి చెప్పింది. ఇక్కడ బద్వేలులో కూడా అధికార పార్టీ ప్రలోభాలకు పూర్తిగా దూరంగా ఉంది. మండలాల మెజార్టీ కోసం స్థానిక నాయకులు ప్రచారం చేసుకుని సరిపెట్టారు. పోలింగ్ రోజు కూడా మాటలతోనే సరిపెట్టారు కానీ, చేతల్లోకి దిగలేదు. అటు బీజేపీ కూడా ఓడిపోయే ఎన్నికే కదా అని డబ్బుల జోలికి వెళ్లలేదని సమాచారం. దీంతో సహజంగానే పోలింగ్ శాతం తగ్గింది. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కొంతమంది ఓటర్లు ఓట్లు వేయలేదనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ప్ర‌బుత్వ ప‌థ‌కాల్లో వేల రూపాయ‌లు తీసుకుంటున్న‌వారు కూడా క‌ద‌ల‌క‌పోవ‌డం అంటే.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త మొద‌ల‌వుతోంద‌ని భావించాలా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.