ఆ సినిమాతో మ‌ళ్లీ స్క్రీన్‌పై పునీత్‌

క‌న్న‌డ ఫిలిం ఇండ‌స్ట్రీలో టాప్ స్టార్ల‌లో ఒక‌డైన పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాత్తుగా గుండెపోటుతో క‌న్నుమూయ‌డం అత‌డి అభిమానుల‌కు తీరని వేదన మిగిల్చేదే. కేజీఎఫ్ మూవీతో యశ్ రేంజ్ మారిపోయింది కానీ.. లేకుంటే శాండిల్‌వుడ్లో పునీతే నంబ‌ర్ వ‌న్ హీరో అని చెప్పొచ్చు. ఆ స్థాయి హీరో మంచి ఫాంలో ఉండ‌గా.. 46 ఏళ్ల‌కే క‌న్నుమూయ‌డం మామూలు షాక్ కాదు.

చివ‌ర‌గా యువ‌ర‌త్న సినిమాతో ప‌ల‌క‌రించిన పునీత్‌.. ఈ మ‌ధ్యే ద్విత్వ అనే భారీ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. లూసియా, యుట‌ర్న్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ డైరెక్ష‌న్లో కేజీఎఫ్ నిర్మాత‌లు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తీయాల‌నుకున్నారు. ఈ చిత్రంతో పునీత్ రేంజే మారిపోయేద‌న్న అంచ‌నాలున్నాయి అభిమానుల్లో. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ముందే పునీత్ వెళ్లిపోయాడు. ఈ సినిమాను పూర్తిగా ఆపేయ‌డ‌మో.. లేక వేరే హీరోతో తీయ‌డ‌మో చేయొచ్చు.

ఐతే పునీత్ మ‌ళ్లీ స్క్రీన్ మీద క‌నిపించ‌డ‌నేమీ లేదు. అత‌డి సినిమా ఒక‌టి చివ‌రి ద‌శ‌లో ఉంది. అదే.. జేమ్స్. దీని షూటింగ్ కొంచెమే మిగిలుంది. పునీత్ అయితే త‌న వ‌ర‌కు టాకీ పార్ట్ అంతా పూర్తి చేసేశాడ‌ట‌. ఇంకేవైనా స‌న్నివేశాలు మిగిలున్నా వాటిని ప‌క్క‌న పెట్టేయ‌డ‌మే. పునీత్‌తో సంబంధం లేని స‌న్నివేశాలుంటే పూర్తి చేసి సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేయ‌డం ఖాయం. కాక‌పోతే పునీత్‌కు వేరే వాళ్ల‌తో డ‌బ్బింగ్ చెప్పించాల్సి ఉంటుంది.

ఇలా పునీత్ సినిమాలో అత‌డి పాత్ర‌కు వేరొక‌రి గొంతు వినిపించ‌డం ఏదోలా ఉంటుంది. కానీ పునీత్ న‌టించిన చివ‌రి సినిమాను అలా వ‌దిలేయ‌లేరు కాబ‌ట్టి, అభిమానుల‌కు చివ‌ర‌గా పునీత్‌ను వెండితెర‌పై చూసుకోవ‌డానికైనా దీన్ని రిలీజ్ చేయ‌డం ప‌క్కా. బ‌హుశా వ‌చ్చే ఏడాది మార్చి 17న పునీత్ పుట్టిన రోజు నాడు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయొచ్చ‌ని శాండిల్ వుడ్ మీడియా వ‌ర్గాలంటున్నాయి.