హుజూరాబాద్ జోరు.. వెనుక‌బ‌డిన బ‌ద్వేల్!!

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌బుత్వాల‌కు ప్రాణ‌ప్ర‌దంగా మారిన‌.. రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన్ని ఉద్రిక్త త‌లు.. మ‌రికొన్ని ఆరోప‌ణ‌ల మ‌ధ్య స‌జావుగానే సాగింది. ఏపీలో సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాక‌డ‌ప‌లోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌, తెలంగాణ‌లోని ఉమ్మ‌డి క‌రీం న‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా పూర్త‌యిపోయింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా అధికార పార్టీల పెద్ద‌ల‌కు ప్రాణ‌ప్ర‌దం.. అంత‌కు మించి ప్ర‌తిష్ఠ కూడా! దీంతో అటు టీఆర్ ఎస్‌, ఇటు.. వైసీపీలు వ్యూహాత్మ‌కంగా చ‌క్రాలు తిప్పాయి. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు అనేక ఎత్తుగ‌డ‌లు వేశాయి. దీంతో ఇక్క‌డ క్ష‌ణ‌.. క్ష‌ణం.. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. చివ‌ర‌కు శ‌నివారం జ‌రిగిన ఉప పోరు.. అత్యంత ఆస‌క్తిగా మారింది.

ఇక‌, పోలింగ్ విష‌యానికి వ‌స్తే.. హుజూరాబాద్‌లో ఉన్న దూకుడు బ‌ద్వేల్‌లో క‌నిపించ‌లేదు. వాస్త‌వానికి బ‌ద్వేల్‌లో 70 నుంచి 75 శాతం మేర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని వైసీపీ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. కానీ, ఇక్క‌డ 60 శాతం మించే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. మ‌రోవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు.. ఫిర్యాదు చేశారు. బద్వేలు ఉపఎన్నికలో అవకతవకలు జరుతున్నాయని ఆరోపించారు. బయటి వ్యక్తులు వస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేశారు. మ‌రోప‌క్క‌, బీజేపీ నేత‌లు.. బూత్‌ల‌ను ప‌రిశీలించారు. అదేవిధంగా వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ కూడా బూత్‌ల‌ను ప‌రిశీలించి.. ఎక్క‌డా అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌డం లేద‌ని తెలిపారు. సో.. మొత్తంగా చిన్న‌పాటి వివాదాలే త‌ప్ప‌.. బ‌ద్వేల్ పోలింగ్ ప్ర‌శాంతంగానే సాగుతున్నా.. ఓట్లు పెర‌గ‌క‌పోవ‌డంతో అటు అధికార ప‌క్షం, ఇటు.. బీజేపీ కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి.

ఇక‌, హుజూరాబాద్ విష‌యానికి వ‌స్తే.. ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా.. జోరుగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్‌ జరగనుంది. కరోనా నిబంధనల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. అటు బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌, ఇటు అధికార పార్టీ టీఆర్ ఎస్‌లు.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వీణ‌వంక‌లో ఓట‌ర్లు ఉద‌యం నుంచే బారులు తీరారు. భారీ ఎత్తున పోలింగ్ న‌మోదైంది. ఇటీవ‌ల డ‌బ్బుల పంపిణీకి సంబంధించి ఇక్క‌డే వివాదాలు రేగాయి. సో.. ఇక్క‌డ ఓట్లు బాగా ప‌డ‌డంతో ఎవ‌రికి వేశార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీంతో ప‌లు చోట్ల ఆందోళనలు జరిగాయి.

వీణవంక మండలంలో పలుచోట్ల అధికార టీఆర్ ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. అధికార‌ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు ఆందోళనలకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త‌త జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌శాంతంగానే పోలింగ్ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఓటింగ్ మాత్రం 80 శాతం వ‌ర‌కు పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని.. అధికారులు చెబుతున్నారు. దీంతో పెరిగిన ఓటింగ్ త‌మ‌కే క‌లిసి వ‌స్తుంద‌ని.. అటు అధికార టీఆర్ ఎస్‌, ఇటు విప‌క్షం బీజేపీ కూడా చెబుతున్నాయి. మ‌రి ఇక్క‌డ ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.