సందీప్ రెడ్డి వంగాకి అంతిస్తున్నారా..?

ఒక్క సినిమాతో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన డైరెక్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకరకంగా ట్రెండ్ మార్చిందనే చెప్పాలి. ఈ సినిమాను మిగిలిన భాషల్లో కూడా రీమేక్ చేయగా.. మంచి విజయాన్ని అందుకుంది. హిందీ వెర్షన్ ను సందీప్ రెడ్డి స్వయంగా డైరెక్ట్ చేశాడు. ‘కబీర్ సింగ్’ పేరుతో విడుదలైన ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసేశాడు సందీప్ రెడ్డి.

ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలానే ప్రభాస్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. అదే ‘స్పిరిట్’. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను నాలుగు వందల కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తారని టాక్. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ రూ.150 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. హీరోకి అంతిస్తుండడంతో.. డైరెక్టర్ కి కూడా బాగానే ముట్టజెప్పి ఉంటారనే మాటలు వస్తున్నాయి.

దీనిపై ఆరా తీయగా.. సందీప్ కి రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారట. అది ఎంత శాతమో తెలుసా..? యాభై శాతం. లాభాల్లో యాభై శాతం వాటా అంటే మామూలు విషయం కాదు. అది కూడా ప్రభాస్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ముందుగా ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలను పూర్తి చేయాలి. వాటితో పాటు నాగశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ కూడా ఉంది. వీటన్నింటిమధ్య ‘స్పిరిట్’ను ఎప్పుడు మొదలుపెడతారో..!