మెగాప్టార్‌తో శ్రీకాంత్ అడ్డాల?

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రాలతో తనపై అంచనాల్ని భారీగా పెంచిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ చిత్రాల్లో అతడి ప్రతిభ చూసి.. మెగా ఫ్యామిలీ కుర్రాడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేసే బాధ్యత అతడి నెత్తినే పెట్టారు. కానీ ‘ముకుంద’తో అతను అంచనాలను అందుకోలేకపోయాడు. ఆ తర్వాత మహేష్ బాబు అతడి మీద నమ్మకంతో ‘బ్రహ్మోత్సవం’ లాంటి భారీ చిత్రం చేశాడు. అదెంత దారుణమైన అనుభవాన్ని మిగిల్చిందో తెలిసిందే. దెబ్బకి నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీలో లేకుండా పోయాడు శ్రీకాంత్.

మళ్లీ అతను ఓ రీమేక్ మూవీతో రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అదే.. నారప్ప. తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ దానికి వ్యూయర్ షిప్ మాత్రం బాగానే వచ్చి శ్రీకాంత్ దర్శకుడిగా ‘సక్సెస్ ఫుల్’ అనిపించుకున్నాడు. ఇప్పుడతను ఓ సొంత కథతో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

శ్రీకాంత్ కుటుంబ కథతో మెగాస్టార్ చిరంజీవిని కలిశాడని.. ఆయన్ని ఇంప్రెస్ చేశాడని గుసగుసలు వినిపిస్తుండటం విశేషం. చిరు కథ విని సానుకూలంగా స్పందించారని అంటున్నారు. ఈ చిత్రంలో అతిథి పాత్ర లాంటిది ఒకటుందని.. దాని కోసం అల్లు అర్జున్‌ను సంప్రదిస్తున్నారని కూడా ప్రచారం సాగుతుండటం విశేషం. హీరోగా పరిచయం కాకముందు ‘డాడీ’ సినిమాలో చిన్న పాత్ర చేయడం.. హీరో అయ్యాక ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఓ పాటలో తళుక్కుమనడం మినహాయిస్తే చిరుతో బన్నీ కలిసి నటించింది లేదు. ఇప్పుడతను చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ దశలో చిరుతో కలిసి నటిస్తే ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది.

మామూలుగా అయితే శ్రీకాంత్‌తో చిరు సినిమా చేయడం ఏంటి అనిపిస్తుంది కానీ.. మెహర్ రమేష్ లాంటి దర్శకుడికి అవకాశం ఇచ్చిన చిరు.. శ్రీకాంత్‌తో సినిమాకు ఓకే చెబితే అదేమీ ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. నిజానికి తన రీఎంట్రీ మూవీని గీతా ఆర్ట్స్‌లో ఓ మెగా హీరోతోనే చేయడానికి శ్రీకాంత్ గట్టి ప్రయత్నం చేశాడు. అనుకోకుండా ‘నారప్ప’ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి అతను మెగా కాంపౌండ్‌కే చేరినట్లు తెలుస్తోంది.